ఏపీ సీఎం జగన్ చేస్తున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమం.. ప్రత్యేక పథకాలతో దూసుకుపోతున్న తీరును రాష్ట్రంలోని పార్టీలు గుర్తించకపోయినా.. దూరంలో ఉన్న పార్టీలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు బాగానే గుర్తిస్తున్నాయి. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న వలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలను అనేక రాష్ట్రాలు తమ వద్ద కూడా ఏర్పాటు చేసుకునేందుకు ఉవ్వి ళ్లూరుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఇటీవల వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రశంసల వర్షం కురిపించారు.
సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తున్నాయని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇంటింటి సర్వే, వలంటీర్ వ్యవస్థలతో పాటుగా అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు. జాతీయ మీడియా న్యూస్ ఎక్స్లో వచ్చిన ఓ కథనాన్ని కూడా ఆయన షేర్ చేశారు. కరోనాపై పోరులో తొలి నుంచి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని చెప్పారు. కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని పలు రాష్ట్రాలు అనుకరిస్తున్నా యని న్యూస్ ఎక్స్ ఆ కథనంలో పేర్కొంది.
కరోనా మహమ్మారిని ఎదురించేందుకు నూతన మార్గాలను అవలంబించడంలో ఏపీ ముం దుందని.. ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపింది. కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే, సాంకేతిక పరికరాల వినియోగం, వలంటీర్ వ్యవస్థ, డోర్ టు డోర్ సర్వేలను ప్రధానంగా ఆ కథనంలో ప్రస్తావించింది. మరోవైపు.. బ్రిటీష్ హైకమిషన్ కూడా జగన్ను, ఆయన పాలనను కొనియాడింది. కరోనా విషయంలో ఆది నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను ప్రత్యేకంగా ప్రస్థావించింది.
యూకే డిప్యూటీ హై కమిషనర్ ఫ్లెమింగ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. 4.5 లక్షలమంది వాలంటీర్లు, 11వేల మందికి పైగా సెక్రటరీల సాయంతో ప్రతి 10 లక్షల మందిలో 14వేల మందికి టెస్టులు నిర్వహించారని, అలాగే టెక్నాలజీ సాయంతో క్వారంటైన్ను మానిటర్ చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఇది ప్రపంచానికి ఒక పాఠం అంటూ పేర్కొన్నారు. మొత్తానికి పెరటిలోని తులసి చెట్టును కొందరు గుర్తించకపోయినా.. ప్రపంచం గుర్తించిందనే వాస్తవం తెలుస్తోంది.