తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.. అనే సామెతను అక్షరాలా నిజం చేస్తోంది.. రాష్ట్రంలోని ఎల్లో మీడియా. అయితే, దీనిని కొంత మార్పు చేసి.! తప్పులెన్నువారు తమ వారి తప్పులు ఎరుగరు! అనేలా!! విషయంలోకి వెళ్తే.. గడిచిన వారం రోజులుగా వైసీపీ సర్కారులో అధికార పార్టీ నేతలు గనులను దోచేస్తున్నారంటూ.. ఎల్లో మీడియా భారీ ఎత్తున కథనాలను వండి వార్చింది. అధికారం అండగా.. గని కబ్జా.. అంటూ రాతలు రాసేసింది. అదేసమయంలో గన్ పెట్టి.. గని కబ్జాఅంటూ.. కూడా వడ్డించేసింది. అయితే, వీటిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ. వార్తలైతే రాసేసింది.
కానీ, అదే చేతితో బాబుగారి హయాంలో జరిగిన దోపిడీల పర్వంపైనా ఓ కన్నేస్తే.. బాగుండేదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖజిల్లాకు మాజీ మంత్రి కుటుంబ సభ్యుల అక్రమాలకు విశాఖలో కొండలు తరిగిపోయాయి. బినామీల పేరుతో అనుమతులు పొంది గత ప్రభుత్వ హయాంలో చేసిన మైనింగ్ అక్రమాలు బయటకొస్తున్నాయి. గోరంత అనుమతులు తీసుకొని కొండలకు కొండలు తవ్వేస్తున్న వ్యవహారాలు గనుల శాఖ విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగు లోకి వచ్చాయి. దీంతో అధికారులు సదరు సంస్థకు రూ.5.91 కోట్లు జరిమానా విధించారు.
విశాఖ జిల్లాలో రోలుగుంట మండలం కంచుగుమ్మల గ్రామంలో సర్వే నెంబర్ 1లో 4.10 హెక్టార్లలో ఉన్న కొండను హిమాని స్టోన్ క్రషర్ అనే సంస్థకు 2009లో మైనింగ్ కోసం 15 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. 2024 వరకు వీరికి లీజు సమయం ఉంది. వాస్తవానికి ఈ సంస్థ 47,060 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తవ్వకాలకు మాత్రమే అనుమతులు పొందింది. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేపట్టింది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోదరుడు, కుమారుల హస్తం ఉండ డంతో అధికారులు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
దీంతో అనుమతులు పొందిన దాని కంటే అధికంగా 1,36,126.08 క్యూబిక్ మీటర్లు తవ్వేసింది. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న కొండ ప్రాంతంలో 6,073.6 క్యూబిక్ మీటర్లు అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా మైనింగ్ చేసేసింది. మరి వీరు చేసిన పనులు ఎందుకో.. ఎల్లో మీడియాకు ఎక్కడా కనిపించవు.. అంటున్నారు పరిశీలకులు.