తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్దిలో శరవేగంగా దూసుకెళ్తున్న హైదరాబాద్కు కరోనా రూపంలో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్లో కోటి 20లక్షలమంది జనాభా నివాసం ఉంటోంది. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకలా కనిపిస్తుంది. విశ్వ వృత్తులకు వేదికగా కనబడుతూ ఉంటుంది. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానానికి, సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినల్లనపిస్తుంది. గొప్ప చారిత్రక నేపథ్యానికి ప్రతీక..అనేక భిన్న రుచులకు, అభిరుచులకు, వ్యాపారాలకు కేంద్ర బిందువు. హైదరాబాద్ దాని చుట్టూ ఎన్నో గొప్ప పర్యాటక ప్రదేశాలున్నాయి. చారిత్రక కట్టడాలున్నాయి.
వాటి వెనుక ఉన్న చరిత్రేంటో..పర్యాటక ప్రదేశాల్లోని ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు నిత్యం లక్షలాది మంది పర్యాటకులు హైదరాబాద్ వచ్చి వెళ్తుండేవారు. రైలు, విమానాలు దిగిన వద్ద నుంచి ఆటో, ట్యాక్సీ డ్రైవర్ మొదలు ఎన్నో రకాలుగా వృత్తులను నిర్వహిస్తున్న వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేవి. హోటళ్లకు మంచి గిరాకీ ఉండేది. కానీ కరోనా వీటంన్నింటిని చెరిపేసింది. ఉపాధి దూరమైంది..ఉద్యోగాలు ఊడిపోయాయి...జీతాల్లో కోతలు పడ్డాయ్...మొత్తంగా హైదరాబాద్..హైదరాబాద్లా లేదు. రోజురోజుకు భయంతో వణికిపోతోంది. దిన దిన గండంగా గడిపేస్తోంది. ఎప్పుడు కరోనా వీడిపోతుందో నని వేచి చూస్తోంది. మహమ్మారి ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందోనని భయపెడుతోంది.
రోజు కొత్తగా కేసుల నమోదు ఇక్కడ జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.కరోనా వైరస్పై పోరులో తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేస్తోందా.? అంటే, అవుననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. న్యాయస్థానం పదే పదే హెచ్చరిస్తున్నా, తెలంగాణలో జరగాల్సిన స్థాయిలో కరోనా టెస్టులు జరగడంలేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో సగటున 20 వేల కంటే ఎక్కువ టెస్టులు రోజువారీగా జరుగుతున్నాయి. తెలంగాణలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. హైద్రాబాద్లో ఇక బతకలేం.. అంటూ కొందరు సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. పనులు దొరకడంలేదు.. ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాం.. ప్రస్తుతానికి ఊరికి వెళ్ళిపోతున్నాం.. మళ్ళీ పరిస్థితులు బాగుంటే తిరిగొస్తామని హైదరాబాద్కు దూరమవుతున్నారు.