లైఫ్ ఆఫ్టర్ కరోనా విదేశీ విద్య రంగంపై ఎలాంటి ప్రభావం చూపనుందనే విషయాలపై ఇప్పుడు భారత్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే సాగుతోంది. అనేక దేశాలు తమ దేశంలోకి ప్రజలను అనుమతించడానికి ఆంక్షలు విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకు భారత్ కూడా అతీతమేమీ కాదు. అనధికారికంగా ఇప్పుడు చైనా దేశా పౌరులపై అనుమతి నిరాకరించినా ఆశ్చర్యం లేదు. దీనికి చైనాతో ఉన్న విబేధాలే కాకుండా కరోనా ఎఫెక్ట్ కూడా తోడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏటా భారత్ నుంచి ఐరోపా ఖండంలోని దేశాలతో పాటు ఇతర ప్రముఖ అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యనభ్యసించేందుకు లక్షలాది మంది భారతీయ విద్యార్థులు వెళ్తున్నారు.
ఎక్కువగా యూఎస్, యూకే,న్యూజిలాండ్, ఇటలీ, జర్మనీ, జపాన్, రష్యా ఇలా చాలా దేశాలకు పయనమవుతున్నారు. ఆయా కోర్సులను బట్టి, విద్య,ఉద్యోగావకాశాలను బట్టి కూడా వారు ఆయా దేశాల్లో విద్యనభ్యసించేందుకు వెళ్తుంటారు. అయితే కరోనా వైరస్ ప్రభావంతో లక్షలాది మంది విద్యార్థులు ఇప్పటికే వారంతా స్వదేశానికి చేరుకున్నారు. ఇప్పటికైతే వీరి పరిస్థితేంటి అనే దానికి ఎవరూ కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఇప్పుడున్న పరిస్థితిలో విదేశీ విద్య అంత సేఫ్ కాదని సలహా ఇస్తున్నారు. కోర్సుల పూర్తికి ఆదేశా నిర్ణయాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఇక పరాయి దేశంలో ఆర్థిక సమస్యలతో సతమతమవ్వాల్సి వస్తుందని, పార్ట్ టైం జాబులు కూడా దొరికే పరిస్థితి సమీప భవిష్యత్లో ఉండకపోవచ్చని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది పార్ట్ టైం జాబ్లు చేసుకుంటూ చదువుకుంటున్నవారే ఉంటుంటారు. కరోనా వైరస్ నెలకొన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా విదేశాలకు పంపేందుకు సాహసించే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. దీంతో విదేశాల్లోని చాలా యూనివర్సిటీలకు పెద్ద దెబ్బగా పరిణమిస్తుందని విద్యరంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు స్వదేశీ విద్యావిధానంలో మార్పులు తీసుకురావాల్సిన ఆశ్యకతను, పెట్టుబడులు పెరగాల్సిన అవసరాన్ని ఇలా చాలా సూచనలే చేస్తున్నారు. మరి కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.