ఇపుడిదే అంశంపై రాష్ట్రంలో  చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి సిఎంవోలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు అజయ్ కల్లం, పివి రమేష్ లను కీలక బాధ్యతల నుండి తప్పించటం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. దాదాపు ఏడాది కాలంగా జగన్ తరపున అజేయకల్లం చక్రం తిప్పుతున్న విషయం అందరికీ తెలిసిందే. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన కల్లంను వైసిపి అధికారంలోకి రాగానే జగన్ పిలిచి మరీ అందలం ఎక్కించాడు. కల్లం, పివి రమేష్ ను సలహదారులుగానే తీసుకున్నప్పటికీ ప్రభుత్వంలోని అన్నీ శాఖల బాధ్యతలను పర్యవేక్షించే బాధ్యత కల్లంకు అప్పగించాడు. ఏ శాఖ ఉన్నతాధికారులైనా ముందు కల్లంతో మాట్లాడిన తర్వాతే జగన్ తో భేటి అయ్యే స్ధితికి వ్యవహారం చేరుకుంది. ఇలాంటి స్ధితి నుండి ఒక్కసారిగా తాజాగా కల్లంకు అసలు శాఖలే లేకుండా జగన్ తీసుకున్న నిర్ణయంతో అందరికీ షాక్ కొట్టినట్లే అయ్యింది.

 

ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమీషనర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ను సిఎంవో కు జగన్ తీసుకున్న దగ్గర నుండి మార్పులు మొదలైనట్లు సమచారం. ప్రవీణ్ వచ్చిన దగ్గర నుండి కల్లంకు  ప్రాధాన్యత తగ్గటం మొదలైందట. అంతవరకు ఏ విషయంలో అయినా కల్లం నిర్ణయం పైనే ఆధారపడిన జగన్ తర్వాత్తర్వాత ప్రవీణ్ మాటకు విలువ ఇవ్వటం మొదలుపెట్టినట్లు సమాచారం. దాంతో వ్యవహారం అర్ధమైపోయిన కల్లం తాను ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుండి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు జగన్ తో రెండు మూడుసార్లు చెప్పారని సిఎంవో వర్గాలు చెప్పాయి. కల్లం అడిగినా జగన్ మాత్రం అందుకు అంగీకరించలేదట. అందుకనే కల్లం ఇంకా ప్రభుత్వ సలహాదారుగా కంటిన్యు అవుతున్నాడు.

 

అయితే తెర వెనుక ఏమి జరిగిందో ఎవరికీ తెలియటం లేదు కానీ తాజాగా వెలుగుచూసిన ఉత్తర్వులతో కల్లంతో పాటు పివి రమేష్ కు కూడా షాక్ కొట్టిందనే అనుకోవాలి. మొన్నటి వరకు కల్లం కానీ రమేష్ కానీ ప్రభుత్వంలోని అనేక శాఖలను పర్యవేక్షించేవారు. అలాంటిది తాజాగా వచ్చిన ఆదేశాల కారణంగా ఇద్దరికీ ఇపుడు పర్యవేక్షించటానికి ఒక్కశాఖ కూడా లేదు. వీళ్ళ దగ్గర ఉన్న అన్నీ శాఖలను తీసేసి  ప్రవీణ్ ప్రకాష్, ధనుంజయ్ రెడ్డి, సల్మాన్ ఆరోఖ్యరాజ్ లకు అప్పగించాడు జగన్. సిఎం తాజా నిర్ణయంతో కల్లం, రమేష్ కేవలం సలహాదారులుగా మాత్రమే మిగిలిపోయారు. అంటే ఏ శాఖల ముఖ్య కార్యదర్శులు కానీ లేక ఇతర ఉన్నతాధికారులు కానీ పై ఇద్దరినీ కలవాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చని అర్ధమవుతోంది.

 

దాదాపు ఏడాదిపాటు కల్లం నిర్ణయాలపై అంతగా ఆధారపడిన జగన్ ఒక్కసారిగా ఆయన్ను దూరంగా ఎందుకు పెట్టాడో ఎవరికీ అర్ధం కావటం లేదు.  ఒక విధంగా కల్లంను అవమానించటమనే అనుకోవాలి. మరి జగన్ తాజా నిర్ణయంతో కల్లం ఏ విధంగా స్పందిస్తాడో చూడాల్సిందే. ఉత్త సలహాదారుగా కల్లం కంటిన్యు అవుతాడా లేకపోతే పూర్తిగా బాధ్యతల నుండి తప్పుకుని బయటకు వచ్చేస్తాడా ? అన్నది ఇపుడు సస్పెన్సుగా మారింది. అధికారవర్గాల సమాచారం ఏమిటంటే తమనుండి శాఖలను తొలగిస్తున్న విషయంలో  కల్లం, రమేష్ కు ఏమాత్రం ముందు సమాచారం లేదట. చూద్దాం ముందు ముందు జగన్ ఇంకెంతమందికి షాకులిస్తాడో ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: