దేశంలో ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది. దేశ నలుమూలల ప్రతీ నిమిషం ఏదో ఒకచోట ఆడది కన్నీరు కారుస్తూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా.. వరుసలతో సంబంధం లేకుండా తమ కోరికలు తీర్చుకుంటున్నారు కామాంధులు. కూతురిపై తండ్రి, సోదరిపై సోదరుడు, తల్లిపై తనయుడు, అత్త పై అల్లుడు, కోడలిపై మామ ఇలా మానవ సంబంధాలు మరిచి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఆఖరికి ఆపదలో ఆదుకోవాల్సిన పోలీసులు కోసం నీచానికి ఒడిగడుతున్నారు. ఖాకీ ముసుగులో ఆడవారిపై వేధింపులకు పాల్పడుతున్నారు.

 

తాజాగా ఇలాంటి నీచమైన ఘటనే హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. నగరంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వీరబాబు డ్యూటీకి వెళ్లేందుకు శ్రీనగర్ కాలనీ వద్ద వేచిచూస్తున్నాడు. అటుగా కారులో వచ్చిన మహిళని లిఫ్ట్ ఇమ్మని అడిగాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయాలని కొరడంతో ఆమె కారు ఎక్కించుకుంది. కారు ఎక్కిన వీరబాబు మహిళను మాటల్లో పెట్టి ఫోన్ నంబర్ అడిగి తీసుకున్నాడు. పోలీసే కదా అన్న నమ్మకంతో ఆమె ఫోన్ నంబర్ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. సదరు ఖాకీలోని కీచకుడు బయటికొచ్చాడు. మరుసటి రోజు నుంచి ఆమెకు ఫోన్ చేసి వేధించడం ప్రారంభించాడు. వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పెడుతూ మానసికంగా హింసించాడు.

 

అసభ్యకరమైన వీడియోలు పంపుతూ.. తనను నిత్యం వేధించడం మొదలుపెట్టాడు. ఖాకీ ముసుగులో తన కామ కోరికలు తీర్చుకోవాలని చూసిన వీరబాబు వేధింపులు ఎక్కువ అవడంతో భరించలేకపోయిన మహిళ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ 354, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధ్యతాయుతమైన పోలీసులే ఇలాంటి నీచానికి పాల్పడితే... ఆ మహిళలకు దిక్కెవరు. ఇలాంటి పోలీసులను చూసి ప్రస్తుత యువత ఏం నేర్చుకుంటుంది. ఇలాంటివి ఇకపై జరగకూడదు అంటే.. వీరబాబుకు కఠినమైన శిక్ష పడేలా పోలీసు అధికారులు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: