గత 24గంటల రాజస్థాన్ రాజకీయ నాటకం రక్తి కట్టింది. ఆడింది..ఆడించింది... అంతా గెహ్లాటేనని కాంగ్రెస్ సీనియర్ నేతల్లో అప్పుడు గుసగుసలు మొదలయ్యాయి. సచిన్ తిరుగుబాటు చేసేలా చేసింది గెహ్లాటేనని, బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన ఫోన్ సంభాషణల తాలుకు ఆధారాలు లభ్యమయ్యాకే..ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నిస్తున్నాడంటూ అధిష్ఠానంకు సమాచారం ఇవ్వడమే కాక ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటూ ఇరుకున పడేశారు. దీంతో గెహ్లాట్ వ్యూహాన్ని పూర్తిగా అర్థం చేసుకోని సచిన్ గెహ్లాట్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పించాలని నిజంగానే ముందుకు రావడం కాంగ్రెస్ అధిష్ఠానానికి కోపం తెప్పించింది.
తన తర్వాత సీఎం రేసులో సచిన్ ఉండదకూడదన్నది గెహ్లాట్ ఆలోచనగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో సచిన్ వ్యవహారం ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కీలకంగా మారడంతో తన నిర్ణయాలకు ఇబ్బంది కలుగుతోందన్నది గెహ్లాట్ భావించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం, తన తర్వాత సీఎంగా ఎదిగే అవకాశాన్ని తుంచేయాలని, సచిన్ పొలిటికల్ కెరీర్ ప్రశ్నార్థకం చేసి కొడకు వైభవ్ కెరీర్ నిర్మించాలనే లక్ష్యంతో ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. రెబల్గా మారే పరిస్థితులు కల్పించి పార్టీలో ప్రాముఖ్యతను తగ్గించాలనే అశోక్ గెహ్లాట్ వలకు సచిన్ చిక్కారని వివరించారు. సచిన్ తిరుగుబాటు చేసినా సర్కారుకు ఢోకా ఉండదని ధ్రువీకరించుకున్నాకే ఈ ఉదంతానికి తెరలేపారని చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా ఇతర ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 123 ఓట్లు వచ్చిన తర్వాతే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. వీటన్నింటి కంటే ముఖ్యంగా సచిన్ పార్టీలో ఉంటే తన కొడుకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఉండదు, రాజకీయ భవిష్యత్కు ఇబ్బందులు తప్పవని యోచించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను పార్టీపై పట్టు బిగించాలన్నా..తన కొడుకుకు రాజకీయ భవిష్యత్కు పక్కా చేయాలన్నా ముందు సచిన్ పార్టీలో ఉండకూడదన్నది ఆయన వ్యూహాంగా సీనియర్ నేతలు అంతరంగీక సంభాషణల్లో ముచ్చటించుకుంటున్నట్లు సమాచారం.