విశ్వసనీయతకు మారుపేరుగా ఏపీలో పాలన చేస్తున్న సీఎం జగన్.... మరోసారి తనను నమ్మిన వారిని ఎలా మోస్తారో నిరూపించారు. తనపట్ల విశ్వాసం చూపించిన వారికి.. తను ఎంత విశ్వాసంగా ఉంటారో నిరూపించారు. 2019 ఎన్నికలకు ఆరు మాసాల సమయం ఉంది. గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట నియోజకవర్గం అప్పటి మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారాజు జోరుగా ఉన్నారు. ఆయన మంత్రిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వరుస విజయాలతో అప్పటికే దూకుడుగా ఉన్న ఆయనకు.. ఈ ఎన్నికలు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. టీడీపీ వర్సెస్ వైఎస్సార్ సీపీ ల మధ్య మరింత పోటీ నెలకొంది.
ఈ క్రమంలో ప్రత్తిపాటిని ఓడించేందుకు వైఎస్సార్ సీపీ జెండాను పాతేకుందుకు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ప్రయత్నించారు. ప్రజల్లోకి చేరువయ్యారు. వైఎస్ కుటుంబానికి కూడా అత్యంత ఆప్తుడైన మర్రి.. ఇక, గెలుపు ఖాయమనే అనుకున్నారు. పదేళ్లుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీని మోస్తోన్న జగన్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. చివర్లో కులసమీకరణల నేపథ్యంలో జగన్ ఈ సీటును బీసీలకు ఇవ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటికప్పుడు టీడీపీ నుంచి వచ్చిన విడదల రజనీకి ఈ సీటు ఇచ్చారు.
అయితే, ఇంతలోనే జగన్ అక్కడకు ప్రచారానికి వచ్చారు. వచ్చే ఎన్నికల అనంతరం ఏర్పడే మా ప్రభుత్వంలో మర్రి అన్నను మంత్రి చేస్తాను.. ఎమ్మెల్సీని చేస్తాను. అని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో మర్రి రజనీ గెలుపులో తన వంతు పాత్ర పోషించారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా.. మర్రికి ఇంకా జగన్ ఇచ్చిన హామీలు నెరవేరలే దు. దీంతో ఆయన వర్గంలోనే నిరాశ ఏర్పడింది. ఈ లోగా వైసీపీలోని సీనియర్లు, పార్టీ నాయకులు.. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటివారు.. ఈ విషయంలో మర్రికి న్యాయం చేయాలని గుర్తు చేసినట్టు టాక్.
జగన్పై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. తాజాగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానిని ఖచ్చింతంగా మర్రి రాజశేఖర్కు ఇచ్చేలా వారుచక్రం తిప్పారని తెలుస్తోంది. ఇక కమ్మ సామాజిక వర్గాన్ని జగన్ పక్కన పెడుతున్నారన్న ప్రచారంతో పాటు రాజధాని మార్పు విషయంలో జగన్ కమ్మలకు అన్యాయం చేశాడన్న అంశాలకు కూడా మర్రికి ఎమ్మెల్సీతో పూర్తిగా చెక్ పెట్టేయాలని జగన్ నిర్ణయించుకున్నారని.. ఈ క్రమంలో జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు మర్రికి పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో రేపో.. నిర్ణయం వస్తుందని అంటున్నారు.