కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని సంవత్సరాలుగా కనిపించని ఐక్యతా రాగం వినిపిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వంపై ఇటీవల ఆ పార్టీకి చెందిన నేతలు నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ బలపడుతోందన్న సంకేతాలు అక్కడక్కడా కనిపిస్తుండటం గమనార్హం. క్షేత్రస్థాయిలో పోరాటాలకు కాంగ్రెస్ నేతలు దిగుతుండటం కూడా జనం వారి వైపు చూసేలా చేస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డి పాడు ఎత్తు పెంపుతో దక్షిణ తెలంగాణ జిల్లాలు ఎడారిగే మారే ప్రమాదముందంటూ చేపట్టిన జలదీక్షకు మంచి స్పందన వచ్చింది. ఇందులో అనేక ప్రజా సంఘాలు కూడా మిలితమై ముందుకు కదలడం గమనార్హం.
ప్రభుత్వం ట్రిబ్యునల్లో కూడా సరైన వాదనలు వినిపించడం లేదన్నది కాంగ్రెస్ నేతలు చేస్తున్న వాదన.ప్రభుత్వం నుంచి స్పందించే వారు కూడా కరువవడం గమనార్హం. కేసీఆర్ అదృశ్యం చుట్టూ..సచివాలయం కూల్చివేత వంటి కొన్ని అంశాలను కూడా కాంగ్రెస్ నేతలు జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారనే చెప్పాలి. ప్రభుత్వం జనం సొమ్మును ఆగం చేస్తోందనే వాదనను కాంగ్రెస్ నాయకులు జనంలోకి తీసుకెళ్లారు. అయితే దీనిపై జనాల్లో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ.. మొత్తంగా కాంగ్రెస్ మాత్రం జనం చర్చలోకి రావడం గమనార్హం. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లుగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఆఫ్ ది రికార్డులో మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ దీనిపై క్షేత్రస్థాయి నుంచి ఒక అంతర్గత సర్వే చేసినట్లు నేతలు వెల్లడించారు. ఈ సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందని, ఈ సమయంలో పార్టీ నేతలు వేర్వేరు కుంపట్లు మాని ప్రజల్లోకి వెళ్లాలని చర్చించుకున్నట్లు సమాచారం. రెండు నెలల కిందట వరకు వేర్వేరుగా ఉండే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ భట్టీ, ఎంపీలు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు వంటి నేతలంతా కూడా ఇప్పుడు ఒక్కతాటి మీదకి రావడం పార్టీకి శుభపరిణామమని శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వంపై పోరుకు కలిసి వస్తున్నారు. ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి కూడా పోరుకు దిగుతున్నారు. కరోనాపై మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో కమిటీని కూడా వేసుకోవడం గమనార్హం. మరి ఈ ఐక్యత రాగం ఎన్నాళ్లు సాగుతుందో అన్నది వేచి చూడాలి.