1) మనకు ఎటువంటి రాజధాని కావాలి?
రాజధాని అవసరం కేవలం పరిపాలనా సౌలభ్యం కొరకే, వ్యాపార రిత్యా వాణిజ్య రాజధానులు ప్రపంచంలో భౌగోళిక, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యమున్నటువంటి మానవ వనరుల స్ధితిపై ఆధారపడి ఉంటాయి. మన దేశంలో డిల్లీ పరిపాలనా రాజధాని, కాని వాణిజ్య రాజధాని ముంబాయి. అలానే అమెరికా దేశంలో న్యూయార్క్, చికాగో, లాస్ ఏంజిల్స్ లాంటి ఎన్నో మహానగరాలు వాణిజ్య కేంద్రాలుగా వృద్ధి అయ్యాయి. పరిపాలన కోసం వాషింగ్టన్ లాంటి చిన్న పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆస్ట్రేలియా దేశంలో కూడా అంతే. సిడ్నీ, మెల్బోరన్, లాంటి నగరాలకు దూరంగా ఒక చిన్న ప్రదేశంలో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి ఇది. పరిపాలన కోసం కేవలం తక్కువ విస్తీర్ణంలో చిన్న ప్రదేశంలో ప్రజా ధనం వృధా చేయకుండా రాజధాని ఏర్పాటు చేసుకోవడం సమర్ధులు చేసే పని.
2) రాజధాని నిర్మాణానికి ఎంత విస్తీర్ణం కావాలి ?
దేశంలో ఎక్కడ చూసిన రాష్ట్ర రాజధానికి కేవలం పరిపాలనా మౌలిక వసతుల కోసం కొద్దిపాటి స్ధలం అవసరం కాగలదు. హైదరాబాద్లో అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం మొత్తం కలిసి కేవలం 100 ఎకరాలకు మించి ఎక్కువ విస్తీర్ణంలో లేవు. శాఖాధిపతులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్ధల విస్తీర్ణం కలిపి కూడా 500 ఎకరాలకు మించదు. కొత్తగా నిర్మించినటువంటి రాజధాని రాయిపూర్లో కూడా 4 లేక 5 వేల ఎకరాలకు మించదు.
3) పెద్ద రాజధాని వలన ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా ?
ఇప్పటి వరకు పరిశోధనల్లో కూడా పెద్ద రాజధాని వలన ఉపయోగాలున్నట్లు ఎక్కడా చెప్పలేదు. పెద్ద పట్టణాలల్లో నగరాల్లో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని దురభిప్రాయం స్వార్ధ ప్రయోజనాలున్న వారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి అమెరికా వంటి దేశాలలో కూడా పెద్ద బహుళ జాతి సంస్ధలు చిన్నచిన్న పట్టణాలలో ఉన్నాయి ఉదాః- మైక్రోసాఫ్ట్ సియోల్ పట్టణంలో ఉన్నది. వారన్ బఫెట్ కంపెనీలు, ప్రధాన సంస్ధలన్నీ ఒమాహా అనే అతి చిన్న పట్టణంలో ఉన్నాయి. గూగుల్ లాంటి కొత్తగా వెలిసిన కంపెనీ కూడా సిలికాన్ సిటీ లాంటి చిన్న పట్టణంలోనే వెలసినది. పెట్టుబడులు పెట్టేవారు నగర పరిమాణాన్ని, జనసాంద్రతను చూడరు. వారికి కావలసిన వసతులు, మానవ వనరులు మౌలిక వసతులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
4) మరి దేనికోసం ఈ అమరావతి ప్రచారం ?
అమరావతి నిర్మాణం తెలుగుదేశం నాయకత్వానికి వారి మద్ధతుదారులకు బాగా లాభదాయకంగా ఉండేటట్లు చూడటం చంద్రబాబు రాజకీయ అవసరం. హైదరాబాద్ వంటి చోట్ల అన్ని వ్యాపారాలు చేసి బాగా లాభాలు పోగు చేసుకున్న వారికి అందుకు ధీటైన బంగారు గనిగా రాజధాని నిర్మాణం కనిపించింది. అయితే దాని నిర్మాణం అంతా పూర్తి అయిన తరువాత లాభాలు వస్తాయంటే వారు ఆగరు. కట్టే క్రమంలోనే వారిని తక్షణం సంతృప్తి పరచాలి, ఇది కట్టడం కన్నా మరింత ముఖ్యం. 2019 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడానికి వారి అండదండలు అవసరం. ప్రైవేటు భూములతో, ప్రైవేటు శక్తులతో నమూనా నడపాలి. రైతుల భూములు కారు చౌకగా తీసుకొని భారీ రేట్లలో అమ్ముకోవడం కోసం కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్ధానిక నాయకులు రంగంలోకి దిగి పోటాపోటీగా భూములు కొనడం జరిగినది. రాజధాని ప్రాంతంలో పూలింగ్ జరిగే నాటికే భూ యాజమాన్య స్వరూపం మారింది. దీన్ని ప్రతిపక్షాలు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు దానిపై ముఖ్యమంత్రి కొంటే తప్పేంటని అసెంబ్లీ సాక్షిగా వాదనలు చేశారు. ఇదేకాక రాజధాని కట్టేలోగా విజయవాడలో ప్రభుత్వ సభలు, కార్యక్రమాలు జరగాలి. వాటికి పాలకపక్షీయుల హోటల్స్, ఫంక్షన్ హాల్స్ ని భారీ రేటులో తీసుకోవడం జరిగినది. ప్రభ్రుత్వ శాఖల కార్యకలాపాలు కూడా ఇలాంటివారి ప్రైవేటు భవనాలలోనే ఏర్పాటు చేయటం వలన అడ్వాన్స్ రూపంలో పెద్దమొత్తాలు ముట్టజెప్పడం జరిగింది.
5) ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు, ఆసుపత్రులకు కార్పోరేట్ సంస్ధలకు కారు చౌకగా భూములు ఇవ్వడం సమంజసమేనా?
సామాన్య రైతుల నుంచి సేకరించిన భూమిని ప్రజా ప్రయోజనాలకోసమే వినియోగించాలనేది పరిపాలన మౌలిక సూత్రం. లాభాల ఉద్ధేశ్యంలో నడిపే ఏ సంస్ధలకు ప్రభుత్వ భూమిని కాని ప్రజలనుంచి సేకరించిన భూమిని కాని తక్కువ ధరకు ఇవ్వకూడదు అనేది ఒక నైతిక సూత్రం. ఈ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఏమీ కూడా అలాంటి రాయితీలు విద్యార్థులకు ఇస్తున్న దాఖలాలు లేవు. అటువంటి సంస్ధలు రిజర్వేషన్ లాంటి సామాజిక బాధ్యతను నెరవేర్చరు. కేవలం స్వలాభం కోసం అవసరం కంటే ఎక్కువ సేకరించిన భూమిని నింపడం కోసం అలా నింపి ఏదో సాధించామని భ్రమలు కల్పించడం కోసం చేస్తునటువంటి నీతిలేని రాజకీయమే అని చెప్పవచ్చు.