నిప్పులు చిమ్ముతూ.. కోట్లాది మంది ప్రజలను ఉద్వేగపరుస్తూ చంద్రయాన్-2 చందమామ వైపు దూసుకెళుతోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ రహస్యాల్ని కనిపెట్టేందుకు అంతరిక్షంలోకి వెళ్లిపోయింది. సెప్టెంబర్ 6-7 తేదీల నాటికి అది చంద్రుడిని చేరుతుంది. ల్యాండర్ సేఫ్గా దిగిన తర్వాత... అందులోంచీ... ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. అది చందమామపై 500 మీటర్ల ఏరియాలో తిరుగుతుంది. అది 28 రోజులపాటూ చందమామ చుట్టూ తిరుగుతూ ఉంటుంది.
ప్రజ్ఞాన్ రోవర్.. చందమామపై మట్టి, రసాయనాలు, నీటి జాడలు, మూలకాలు, ఖనిజాలు వంటి విషయాల్ని ఇస్రోకి చేరవేస్తుంది. ప్రధానంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు గడ్డకట్టి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందుకే ల్యాండర్ను అక్కడ ల్యాండ్ చేస్తున్నారు. చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను HD ఫొటోలు తీస్తూ.. ఇస్రోకు పంపుతుంది. చంద్రయాన్-2 ప్రయోగాన్ని మనం లైవ్లో చూడొచ్చు. అలాగే ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా చూడొచ్చు.
27 కేజీల ప్రజ్ఞాన్ రోవర్.. నీటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇస్తుందా అని శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చందమామపై కావాల్సినంత నీరు ఉంటే.. ఇక మనుషులు అక్కడకు వెళ్లి, కాలనీలు ఏర్పాటు చేసుకునేందుకు వీలవుతుంది. ఐదేళ్లుగా చేస్తున్న ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు 978 రూపాయల కోట్లు. ఆ మధ్య వచ్చిన హాలీవుడ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు అయిన ఖర్చు 356 మిలియన్ డాలర్లు. చంద్రయాన్-2 ప్రాజెక్టుకు అయిన ఖర్చు డాలర్లలో చెప్పాలంటే అంతా కలిపి 142 మిలియన్ డాలర్లే. ఇంత తక్కువ ఖర్చుతో అంత ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తున్న ఇస్రోపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇస్రో చరిత్రలో తొలి అతి పెద్ద అంతరిక్ష ప్రాజెక్టు చంద్రయాన్-1. 2008 అక్టోబరు నుంచి 10 నెలల పాటు ఇది చంద్రుని మీద పరిశోధనలు జరిపింది. తక్కువ ఖర్చుతోనే పూర్చతి అయి చరిత్ర సృష్టించడమే కాక చంద్రుడి మీద నీటి ఆనవాళ్లు ఉన్నాయని కనిపెట్టి మరికొన్ని కొత్త పరిశోధనలకు తెరతీసింది చంద్రయాన్-1. దానికి కొనసాగింపుగా చంద్రయాన్-2ని ఇప్పుడు ప్రవేశపెట్టారు. ఈసారి లూనార్ రోవర్ మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగి పలు పరిశోధనలు చేస్తుంది. చంద్రమండలాన్ని మనిషికి నివాసయోగ్యంగా మార్చడానికి ఏమేం చర్యలు చేపట్టాలో తెలుసుకునేందుకు ఈ పరిశోధనలు తోడ్పడతాయని భావిస్తున్నారు. అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ దేశాలు కూడా చంద్రమండల యాత్రలకు సన్నాహాలు చేస్తున్నాయి. మొదట రోవర్లనూ రోబోలనూ పంపి మరో నాలుగైదేళ్లలో మనుషుల్ని పంపేందుకు ఈ దేశాలన్నీ సిద్ధమవుతున్నాయి.
నిజానికి విశ్వరహస్య పరిశోధనలకు అంకురార్పణగా సరైన వాతావరణం చంద్రుడిపైనే ఉందని చెప్పవచ్చు. మిగతా గ్రహాల కంటే చందమామ మనకు దగ్గరగా ఉంది. అది ఎలా ఏర్పడింది, ఎలా ఇలా మారిందో తెలుసుకుంటే, మన సౌర వ్యవస్థ గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. స్పేస్ ట్రావెల్పై అంచనాలు పెరుగుతున్నాయి. భూమి లాంటి గ్రహాలున్నట్లు తెలుస్తోంది. భూమి ఉపగ్రహమైన చందమామ గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. వేరే గ్రహాలపైకి ఎలాంటి మిషన్లు పంపాలో తెలుస్తుంది.
ఏది ఏమైనా చంద్రయాన్-2 చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం ఇది. ప్రపంచమే ఆశ్చర్యపోయే స్థాయికి చేరడం ప్రతీ భారతీయుడూ గర్వించదగ్గ పరిణామం.