విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సెర్చ్ కమిషన్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ వి.ఈశ్వరయ్య అన్నారు. అందరికీ మెరుగైన విద్య అందించాలనే ఎపి లో కమిషన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎపి ఉన్నత విద్య నియంత్రణ అండ్ పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ గా బుధవారం జస్టిస్ ఈశ్వరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. కమీషన్ ఏర్పాటు ఇటు ప్రభుత్వానికి, అటు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభ పరిణామమన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, వివక్ష లేని జాతి కోసం భారత రాజ్యాంగం రూపొందించారని చెప్పారు. ప్రజా స్వామ్య దేశంలో ఎన్మో రకాల వివక్షకు విద్య గురైందని జస్టిస్ అభిప్రాయపడ్డారు. సమాజంలో అందరికీ మంచి విద్యను సమానంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. కులవివక్షకు, రిజర్వేషన్ డిమాండ్ లకు నాణ్యమైన విద్య లేకపోవడమే కారణమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాల అయినా ఇంకా కులవివక్ష పోలేదని వాపోయారు.
అందుకే అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే వివక్ష ను రూపుమాపవచ్చని చెప్పారు. విద్య వ్యాపారం కాకూడదు.. విలువలతో లేనిదై ఉండకూడదని స్పష్టం చేశారు. విద్యకు సంబంధించి పకడ్బందీ గా సమగ్రమైన చట్టాన్ని దేశంలో ఎవరూ చేయలేదన్నారు. పాఠశాల, కళాశాలలో ఫీజులు, సౌకర్యాలు పై పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. ఈ కమిషన్ లో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉంటారన్నారు. పలు కమిషన్ లు సూచించిన ప్రమాణాలను అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత కమిషన్ దని చెప్పారు. కోర్టు ఆదేశాల తరహాలో ప్రాసిక్యూషన్ చేసే విధంగా సివిల్ కోర్టు అధికారాలు కూడా తమ కమిషన్ కు ఉందన్నారు. తమ ఆదేశాలను పాటించకపోతే ఫైన్ వేయవచ్చని చెప్పారు. అంతే కాదు ఆయా ఇనిస్టిట్యూట్ లను రద్దు కూడా చేయవచ్చని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు.
ఎపి రాష్ట్రం విద్యా వ్యవస్థ అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఉండాలన్నదే కమిషన్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సామాజిక న్యాయం గురించి ప్రభుత్వం ఎంతో పాటుపడుతుందని చెప్పారు. ఇందులో అన్నివర్గాల వారు పాలు పంచుకోవడం ద్వారా ఉత్తమ విద్యను అందించవచ్చన్నారు. ఇందులో నిష్ణాతులు అయిన ప్రొఫెసర్ లను నియమంచి కొన్ని అధికారాలు ఇవ్వాలన్నారు. ఇప్పుడే కమిషన్ ఏర్పాటు అయినందున.. ఫీజుల పర్యవేక్షణ కు కొంత సమయం పడుతుందన్నారు. ఆయా కాలేజీల్లోవిద్యా ప్రమాణాలు, వసతులు వంటివి పరిశీలించి వాటిని బట్టి ఫీజులు నిర్ణయించేలా చట్టం చేస్తామని చెప్పారు . కొన్ని కాలేజీలలో విద్యా ప్రమాణాలు బాగోలేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అటువంటి కాలేజీలను పరిశీలించి విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు కూడా సమస్యలు మా దృష్టి కి తీసుకు వస్తే.. పరిశీలిస్తామని చెప్పారు.