నిరుద్యోగులకు ఇది శుభవార్త అనే చెప్పాలి.. ఎందుకంటే నిరుద్యోగులకు ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రభుత్వాలు అన్ని సానుకూలంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కేంద్రం రాజ్యసభకు ఓ సంచలన విషయాన్నీ తెలియచేసింది. అదేంటంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో వివిధ శాఖల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం నిన్న లిఖితపూర్వకంగా ఖాళీల వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గతేడాది మార్చి 1 నాటికి మొత్తం 6,83,823 ఖాళీలున్నాయని.. వాటిలో గ్రూప్-సి పోస్టులు 5,74,289 కాగా, గ్రూప్-బి పోస్టులు 89,638. గ్రూప్-ఎ ఉద్యోగాలు 19,896 ఉన్నాయని మంత్రి వెల్లడించారు.
అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం 1,06,338 ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇప్పటికే నియామక ప్రక్రియను ప్రారంభించినట్లు జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. కాగా 2017-18లో 'సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్స్(సీఈఎన్)' గ్రూప్-సి, లెవల్-1 పోస్టుల భర్తీకి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ 1,27,573 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఈ రెండేళ్లలో ఖాళీల సంఖ్య మరింత పెరిగిందని అయన తెలిపారు.
కాగా సభలో సభ్యులు అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ సమాధానామిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు సంబంధించి వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ రిజర్వ్డ్ ఖాళీలు ఉన్నాయన్నారు. దాదాపు 90 శాతం మంది ఉద్యోగులు పనిచేసే పది మంత్రిత్వ శాఖలు, విభాగాల్లోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ బ్యాక్లాగ్ రిజర్వుడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తోందని ఆయన వెల్లడించారు.