పాఠశాల విద్యలో కీలకమైన మండల విద్యాధికారి పోస్టులను క్రమంగా రద్దు చేసే యోచనలో ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాల్లోనే చర్చ నడుస్తోంది. బడీడు పిల్లలను బడిలో చేర్పించడం దగ్గర నుంచి ఉత్తమ ఫలితాలు తీసుకురావడం, పాఠశాలలను పర్యవేక్షించడంలో ఎంఈఓల పాత్ర కీలకమని చెప్పాలి. విద్యను బలోపేతం చేయాల్సింది పోయి ఆ రంగంలో కీలకంగా ఉన్న మండల విద్యాధికారుల వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఎవరికి ఎంఈఓగా ఉద్యోగోన్నతి కల్పించాలనే విషయంపై మీమాంస కొనసాగుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఎంఈఓ వ్యవస్థను స్కూల్ కాంప్లెక్స్ విధానం తీసుకొచ్చి ఎత్తేసే చర్యలకు పూనుకున్నట్టు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ ఎంఈఓ పోస్టులను భర్తీ చేయడం లేదనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్రంలో 589 మండలాలకు 35 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 72 మండలాలు, 5600పాఠశాలలున్నాయి. 5లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 9 మందే రెగ్యులర్ ఎంఈఓలున్నారు. మిగతా మండలాల్లో గెజి టెడ్ హెడ్మాస్టర్లే ఆ బాధ్యతలు చూస్తున్నారు.విద్యా బోధనతో పాటు ఎంఈఓ చేసే పనులన్నీ నిర్వహించాలి. తమ పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో పర్యవేక్షణతో పాటు విద్యాసంవత్సరంలో నిర్వహించాల్సినవన్నీ చూస్తారు. ఇక ఎంఈఓలు కేవలం ప్రయివేటు పాఠశాలల నియంత్రణ తప్ప ఏ పనీ చేయడానికి లేదు. దీంతో వీరి పని మండలంలో నామమాత్రమవుతుంది.
కిలోమీటరులో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఒకే దగ్గర కు చేర్చేందుకు చర్యలు చేపట్టారు. మూడు కిలోమీటర్లు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలను కలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య తక్కువుందని ఇప్పటికే 80 పాఠశాలలను రేషనలైజేషన్ పేరుతో కుదిస్తున్నారు. ఐదు కిలోమీటర్లలోపు ఉన్న ఉన్నత పాఠశాలలను మిలితం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో మొదటి దశలో రెండు వందలకు పైగా పాఠశా లలు మూతపడే అవకాశాలున్నట్టు సమాచారం. ఎంఈఓ లు లేకపోవడం వల్ల ప్రభుత్వ విద్యను ప్రచారంలోకి తీసుకెళ్లే బాధ్యత ఎవరూ చూడటం లేదు. సరైన సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులను బడిలో చేర్చే కార్యక్రమమూ జరగడం లేదు. ప్రయివేటు పాఠశాలల నియంత్రణా లేదు.
స్కూల్ కాంప్లెక్స్ విధానం ప్రకారం ఐదు మండలాల పాఠశాలలకు ఒక హెడ్మాస్టర్కు బాధ్యత అప్పగిస్తోంది. వీరు ఇలా క్రమేణా ఆ పోస్టులనే రద్దు చేసే అవకాశం ఉంది. ఎంఈఓల వ్యవస్థను ఎత్తేసే దిశగా పాలకులు చర్యలుండటం పట్ల విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్కూల్ కాంప్లెక్స్ విధానం రావడం పట్ల అభ్యంతరం లేకున్నా ఎంఈఓల వ్యవస్థను కూడా కొనసాగించి వారికి నిర్దిష్టమైన పని అప్పజెప్పాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.