ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కోరలు చాచిన సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్.. దేశదేశాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్లలో కరోనా విశ్వరూపం చూపిస్తుంది. మరోవైపు కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో.. ఎన్నో సంస్థలకు ఆదాయం లేదు.
దీంతో ఆ అప్పుల భారం తట్టుకోలేక.. తమ ఉద్యోగులను పీకిపారేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆదుకునేందుకు ప్రభుత్వ పథకం ఒకటి ఉంది. ఉద్యోగం కోల్పోతే మూడు నెలలు ప్రభుత్వం నుంచి వేతనం లభిస్తుంది. ఈ పథకం పేరు 'అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్' స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రభుత్వం మూడు నెలల పాటు ఆర్థికంగా చేయూతను ఇస్తుంది. అంటే ప్రతీ నెల ఆర్థిక సాయం పొందొచ్చు అన్నమాట. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC ద్వారా బీమా పొందిన సంఘటిత రంగ ఉద్యోగులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందొచ్చు.
అందుకు ఈఎస్ఐ https://www.esic.nic.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగి ఉద్యోగంలో ఉన్నప్పుడు చివరి మూడు నెలలు ఎంత వేతనం పొందారో అందులో 25 శాతం ప్రభుత్వం నుంచి లభిస్తుంది. అయితే ఆర్థిక సంక్షోభం లేదా ఇతర కారణాల వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంతేకాదు, జీవితంలో ఒకసారి మాత్రమే ఈ బెనిఫిట్ లభిస్తుంది. అది కూడా రెండేళ్లుగా ఉద్యోగం చేస్తూ ఉండాలి. మరియు మీ బ్యాంకు అకౌంట్కు ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. మరి ఈ ప్రభుత్వ స్కీమ్కు మీరు అర్హులైతే వెంటనే ఈఎస్ఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని.. ఈ కరోనా కష్టకాలంలో ప్రభుత్వ చేయూతను పొందండి.