ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత ఏడాది డిసెంబరులో చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. భారత్లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. అయితే మరోవైపు ఈ కరోనా ఎఫెక్ట్ ఉద్యోగులపై సైతం పడింది.
లాక్డౌన్ దెబ్బకు కంపెనీలు తమ ఖర్చుల తగ్గించుకునే పనిలోపడ్డాయి. కొన్ని కంపెనీలు జీతాలు తగ్గిస్తుండగా.. మరికొన్ని సంస్థలు ఉద్యోగులను కుదిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏకంగా రెండు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా 82 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇక మొదటి నోటిఫికేషన్ ద్వారా 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది.
ఈ పోస్టులకు 2020 జూన్ 11 సాయంత్రం 4 గంటల్లోగా దరఖాస్తు చేయాలి. ఇక రెండో నోటిఫికేషన్లో 12 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు 2020 జూన్ 22 సాయంత్రం 4 గంటల్లోగా అప్లై చేయాలి. ఈ రెండు నోటిఫికేషన్లను http://careers.ecil.co.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది ఈసీఐఎల్. హైదరాబాద్లోని ఈసీఐఎల్ కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. కంప్యూటర్ సైన్స్లో 60% మార్కులతో ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అర్హులు. మరియు ఏడాది అనుభవం కూడా ఉండాలి. ఇక ఎంపికైనవారికి వేతనం రూ.23,000 లభిస్తుంది.