నిరుద్యోగ యువత అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.. పేరున్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగా లిప్పిస్తానంటూ 18 లక్షలు తీసుకుని పరారైన సంఘటన మరువకముందే మరో మోసం వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉద్యోగాలిప్పిస్తానంటూ ముగ్గురి వద్ద 12 లక్షల 75 వేలు తీసుకొని తప్పించుకు తిరుగుతున్న మోసగాడిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్లో సోమవారం కేసు నమోదు చేశారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన శేఖర్రెడ్డి బంజారాహిల్స్లో నివాసముంటున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రవీణ్, వినేష్, గోపి దిల్సుఖ్నగర్లో ఉంటూ ఉద్యోగ వేటలో ఉన్నారు. మిత్రుల ద్వారా శేఖర్రెడ్డితో వీరు పరిచయం పెంచుకున్నారు. తమకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం కావాలని కోరారు. ముగ్గురి వద్ద 12 లక్షల 75 వేలు తీసుకున్న శేఖర్రెడ్డి వీసాలు, పాస్పోర్టులు సిద్ధం చేసుకోండని సూచించాడు. అన్నీ సిద్ధం చేసుకొన్న తరువాత శేఖర్రెడ్డికి ఫోన్ చేయగా స్పందించడం మానేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పరారీలో ఉన్న శేఖర్రెడ్డిని సోమవారం ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.