తెలంగాణలో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం సాయంత్రం విడుదల చేసింది. 5,415 ఎస్జీటీలకు, 1,941 స్కూల్ అసిస్టెంట్లకు, 1,011 లాంగ్వేజ్ పండిట్లకు, 416 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 9 ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్ఏ) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 31 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. 2018, ఫిబ్రవరి సెకండ్ వీక్లో పరీక్షను నిర్వహించనున్నారు .
సిలబస్, అర్హతలు, పోస్టులు, రోస్టర్ తదితర అంశాలన్నింటినీ శుక్రవారం ఖరారు చేసినట్లు తెలిసింది. ఇందులో మొదట 8,792 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిసింది. సోమవారం టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన కేసు విచారణకు రానున్నందున సుప్రీంకోర్టుకు ఈ నోటిఫికేషన్ కాపీని అందజేయనున్నట్లు సమాచారం.
స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిత్, సెకండరీ గ్రేడ్ టీచర్స్కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు రాత పరీక్షలో 80 శాతం, టెట్లో 20 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పీఈటీ, ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎస్ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ఆధారంగానే జరుగుతుంది. టెట్ వెయిటేజ్ను ఈ పోస్టులకు పరిగణనలోకి తీసుకోరు. టీఆర్టీ నోటిఫికేషన్కు సంబంధించి మిగితా వివరాలు
www.tspsc.gov.in వెబ్సైట్లో చూడొచ్చు.