రాజకీయాల్లో ఎన్టీఆర్, వైఎస్ తరువాత ఒక మనిషిలో నిలువెత్తు తెలుగుదనం కనిపించేది భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లో మాత్రమే. ఎక్కడికి వెళ్లినా తెలుగుదనంతో ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా తెలుగులో మాట్లాడేందుకు ఇష్టపడతారు. తెలుగు భాషకు ఆయనిచ్చే ప్రాధాన్యం అటువంటిది. స్వతహాగా భాషాభిమాని అయిన వెంకయ్య భారతీయ భాషాలనూ గౌరవిస్తారు. హిందీ - ఇంగ్లీష్ బాషల్లో  కూడా అనర్గళంగా మాట్లాడేస్తూంటారు.

 

 ఇటీవల రాజ్యసభ సమావేశాల్లో అనువాద సేవల గురించి తెలియచేస్తూ  ఆయా రాష్ట్రాల ఎంపీలకు అర్థమయ్యేట్టు పది భాషల్లో మాట్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారట. అలాగే.. ఇటీవల హైదరాబాద్ లోని ముఫాకం జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు వెంకయ్యనాయుడు. కార్యక్రమం అనంతరం ఉర్దూ భాషలో చేసిన ట్వీట్ ఉర్దూ ప్రేమికులను ఫిదా చేసింది. ఇప్పుడు ఆ ఉర్దూ ట్వీట్ వైరల్ అయ్యింది. వెంకయ్యకు ఉర్ధూలో కూడా ప్రావీణ్యం ఉందా అనేలా అనిపించింది ఆ ట్వీట్. ‘‘ఈ గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొనడం ఆనందంగా ఉంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు అభినందనలు. ఆహ్లాదకరమైన ఈ కార్యక్రమం అందరికీ గుర్తుండిపోతుంది’’ అని ట్విట్టర్ లో ఉర్ధూలో అభినందనలు తెలిపారు. దీంతో వెంకయ్యనాయుడు భాషాభిమానాన్ని చూసి అందరూ పొగడ్తల వర్షం కురిపించారు.

 

 దీనిపై ఉర్దూ సైన్స్ రచయిత డాక్టర్ అబిడ్ మొయిజ్ స్పందిస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి ఉర్దూ ట్వీట్ ఆ భాష ప్రాధాన్యాన్ని తెలియచేస్తుంది. ఈ ట్వీట్ తో ఉర్దూ బాష ముస్లింలకు మాత్రమే చెందినది కాదు' అని తన సంతోషం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: