ఎన్ఎస్ టిఐలో కొత్త తరం అడ్వాన్స్డ్ కోర్సులలో తక్షణ ప్రవేశాలకు ఆఖరు తేదీ సెప్టెంబరు 6 వ తేదీ వరకు ఉందని హైదరాబాద్ లోని రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంత్రప్రన్యోర్షిప్ (ఆర్ డిఎస్ డిఇ) ప్రాంతీయ డైరెక్టరు తెలిపారు. కొత్త తరం అడ్వాన్స్ డ్ కోర్సుల లో వెనువెంటనే ప్రవేశాలకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కోర్సులను హైదరాబాద్ లోని నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఎస్ టిఐ) కు చెందిన విద్యానగర్ మరియు రామంతపూర్ శాఖలలో బోధించనున్నట్టు తెలిపారు.
సోలార్ టెక్నీషియన్ (ఒక ఏడాది కోర్సు), జియో- ఇన్ఫర్మేటిక్స్ అసిస్టెంట్ (ఒక ఏడాది కోర్సు), మెషినిస్టు (రెండు సంవత్సరాల కోర్సు)లను ఎన్ఎస్ టిఐ విద్యానగర్ లో, డ్రోన్ పైలట్ (6 నెలల కోర్సు), టెక్నీషియన్ ఐఒటి (స్మార్ట్ హెల్త్ కేర్.. ఒక ఏడాది కోర్సు)లు ఎన్ఎస్ టిఐ రామంతపూర్ లో బోధిస్తారు. జియో- ఇన్ఫర్మేటిక్స్ అసిస్టెంట్ కోర్సు కు గణితం ఒక సబ్జెక్టు గా పన్నెండో తరగతి పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన అన్ని కోర్సులకు పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హత ప్రవేశార్హత గా ఉంటుంది.
స్పాట్ అడ్మిషన్ చేపట్టే తేదీ 2019 సెప్టెంబర్ 6వ తేదీ. ఆ రోజు న ఉదయం 10 గంటలకు ‘ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యం ప్రాతిపదిక’న ప్రవేశాలను కల్పించనున్నట్టు పేర్కొన్నారు. ఔత్సాహిక అభ్యర్ధులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆ సర్టిఫికెట్ల రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు 2 పాస్పోర్ట్ ఫోటోల తో ఆయా ఎన్ ఎస్ టిఐ శాఖ లకు తరలివచ్చి సంప్రదించవచ్చని ఆర్ డిఎస్ డిఇ ప్రాంతీయ డైరెక్టరు స్పష్టం చేశారు.