ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్కు గురయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. 2007 నుంచి 2030 నాటికి ఈ సంఖ్య ఇప్పటికంటే 45% ఎక్కువయ్యే అవకాశం ఉందని అవగాహన పెంచే కార్యక్రమాలు, జాగ్రత్తలు, ముందుగానే పసిగట్టే స్క్రీనింగ్ పరీక్షలు ఎన్ని వచ్చినా క్యాన్సర్ రాకుండా నివారించగలగడం ఎవరి చేతుల్లోనూ లేదనేది సత్యం. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధ్యయనాల ప్రకారం 2030 నాటికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాల సంఖ్య అన్ని మరణాల సంఖ్య కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే నోటి క్యాన్సర్స్ విషయంలో మన దేశమే మొదటి స్థానంలో ఉంది.
పిల్లలు టెన్త్ లేదా ఇంటర్ పూర్తి కాగానే.. పై చదువుల కోసం పక్క ఊళ్లకు వెళ్తారు. ఇదే మంచి టైం అనుకుని ఆ స్వేచ్ఛతో సిగరెట్లకు అలవాటు పడిపోతారు. అలాగే ఉద్యోగులు బాగా ఒత్తిడితో ఉండే ఉద్యోగాలూ, కాన్ఫరెన్సులు, మీటింగుల తర్వాత రిలాక్స్ కావడం కోసం పొగతాగడం చాలా మందిలో అలా మెల్లగా అలవాటవుతుంది. ఇలాంటి వ్యవహారాలు అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు కాస్తంత ఎక్కువగా ఉంటుంది.
ఇలా మొదట సరదాగా, టైమ్పాస్ కోసం మొదలయ్యే స్మోకింగ్, గుట్కా, ఆల్కహాల్, బయటితిండి ఎక్కువగా తీసుకోవడం, వృత్తి పరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, వాతావరణ కాలుష్యం, నైట్ డ్యూటీలు, రాత్రంతా నిద్ర లేకుండా పనిచేయడం, శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం ఈ అన్నిరకాల కారణాలతో మహిళలతో పోలిస్తే పురుషులు మరింత ఎక్కువగా క్యాన్సర్కు గురవుతున్నారు. వీటివలన ఇటీవల పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ కు గురయ్యే ప్రమాదం పెరిగిపోయింది.
సిగరెట్, బీడీలు, పాన్, గుట్కా, ఆల్కహాల్, పొగాకు నమలడం మొదలైనవి నోటి క్యాన్సర్కు, ఊపిరితిత్తుల క్యాన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. ప్రతి ఏడాదీ దాదాపు 80,000 మంది వరకు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అందుకే భారతదేశంలోని పురుషులు ఈ క్యాన్సర్ బారిన ఎక్కువగా పడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.