పెరుగు ఆరోగ్యకరమైన ఆహారమని అందరికీ తెలుసు. రోజూ ఆహారంలో పెరుగును తీసుకోవడం వల్ల అది శరీరవ్యవస్థను చల్లగా ఉంచటమేకాక, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.పెరుగును ఏ రూపంలో ఆహారంగా తీసుకున్నా రుచిగానే ఉంటుంది. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది. అయితే పెరుగులో కొన్ని పదార్థాలను కలిపి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేసేయండి మరీ..!
అధిక బరువుతో బాధపడుతున్నవారు కొద్దిగా జీలకర్రను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో కలుపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. పెరుగు తినడం ఇష్టంలేనివారు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. మజ్జిగలో కాస్తా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినడం వల్ల ఫోలిక్ యాసిడ్ శరరీంలోకి చేరుతుంది. ఇది చిన్నపిల్లలకు, గర్భిణీ మహిళలకు ఎంతగానో మేలు చేస్తుంది. కప్పు పెరుగులో కొంచెం నల్ల మిరియాల పొడిని కలిపి తినడం వల్ల మలబద్దకం దూరమవుతుంది.
అలాగే అజీర్ణంతో బాధపడ్తున్నా లేక కడుపులో ఇతర సమస్యలున్నా ఇలా పెరుగు తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే పలు రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగు వినియోగం వల్ల మనం తీసుకునే ఇతర ఆహారపదార్థాల నుండి పోషకాలను, మినరల్స్ను గ్రహించే శక్తి పెంపొందుతుంది. అదే విధంగా.. నోటి పూత, దంతాల నొప్పి, ఇతర దంత సంబంధ సమస్యలు ఉన్నారు కొద్దిగా వాము తీసుకుని ఓ కప్పు పెరుగులో కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.