మన రోజువారి ఆహారంలో పండ్లు కూడా ఒక భాగం. శరీరానికి కావల్సిన పోషకాలు, ఖనిజలవణాలు, విటమిన్లను అందివ్వడంలో పండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి.. ఆయా కాలాన్ని బట్టి వచ్చే పండ్లను తప్పనిసరిగా తినాలి. అయితే అరటిపండు తింటూ తొక్కనీ, దోసకాయ వండుతూ చెక్కునీ తీసి పారేయడం అలవాటు. కానీ అసలు విషయమంతా వాటిల్లోనే ఉంది అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్లలో అసలు కంటే కొసరుగా ఉండే చెక్కులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని అధ్యయనాలూ వెల్లడించాయి. పోషకాహార నిపుణుల ప్రకారం కేవలం పండ్లు మాత్రమే కాదు, కొన్ని రకాల పండ్ల తొక్కల వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నట్లు సూచిస్తున్నారు.
అలాగే కొన్ని పండ్లను తొక్కలతో తింటేనే పూర్తి స్థాయిలో లాభాలు కలుగుతాయట. మరి అలా తొక్క తీయకుండా తినాల్సిన పండ్లేమిటో ఓ లుక్కేసేయండి. సపోటా పండ్లను మనం తొక్క తీయకుండానే తినాలి. దీని వల్ల ఆ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియంట్లు మన శరీరానికి అందుతాయి. రోజుకో ఆపిల్ తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకేగా, యాపిల్తో చేసిన డ్రింక్లూ, జ్యూస్లూ తాగుతున్నాం అనకండి. అందరూ అనుకొనేట్టు యాపిల్ గుజ్జులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు. గుజ్జులో కంటే తొక్కలో ఐదురెట్లు ఎక్కువ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని అధ్యయనాలు తెలిపాయి.
కివీ పండును తొక్క తీయకుండా తింటే దాంతో ఆ తొక్కలో ఉండే ఔషధ గుణాలు ఆందోళనను, ఒత్తిడిని దూరం చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్దకం తొలగిపోతుంది. పుచ్చకాయ ముక్కలు అంటే ఎర్రని గుజ్జే అనుకుంటాం. కానీ అడుగున ఉండే తెల్లని పదార్థంలో పోషకాలు పుష్కలం. దాన్లో సిట్రులిన్ అనే పోషక పదార్థం ఉంటుంది. ఎర్రెర్రని దానిమ్మ గింజల్లో కంటే దాని పొట్టులో రెండు రెట్లు ఎక్కువగా శక్తివంతమైన పోషకాలుంటాయి. కానీ దానిని తినడం మనవల్ల అయ్యే పనికాదుగా. అందుకే దానిని ఎండబెట్టి పొడి చేసుకొని టీ చేసుకోవచ్చు.