ఇండియాలో సమోసా ఇష్టపడని వారు ఉండరు. ప్రాంతాన్ని బట్టి పేరు, రూపం, రుచి వేరుగా ఉన్నా దాదాపు అందరికీ ఇష్టం అయిన తిండి వస్తువు ఇది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమోసా దొరుకుతుంది. అందుకే సమోసా భారత్‌లోనే పుట్టిందని అందరూ భావిస్తారు. నిజానికి సమోసా వేల మైళ్లు ప్రయాణించి ప్రాచీన ఇరాన్ నుంచి భారతదేశంకి చేరింది.

 

సమోసా తొలిసారి భారతదేశానికి ఎప్పుడొచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. కానీ పర్షియన్ పదం 'సనుబాబాద్' నుంచి సమోసా పేరు వచ్చినట్లు తెలుస్తోంది. గజాన్వీ సామ్రాజ్యంలోని న్యాయస్థానంలో ఉప్పగా ఉండే పదార్థం వడ్డించేవారని చరిత్రకారుడు అబ్దుల్ ఫజల్ బెహౌకీ పేర్కొన్నాడు. దానిని కరకరలాడేలా నూనెలో వేయించేవారని ఆయన వివరించారు.ఆ పదార్థమే సమోసాగా మారిందట.

 

అయితే, ఇరాన్ నుంచి భారత్‌కు వర్తకుల రాకపోకలు పెరగడంతో సమోసాలో అనేక మార్పులు వచ్చాయి. కాలక్రమేణా సమోసా తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ చేరింది. క్రమంగా సమోసా రైతులకు ప్రధాన ఆహారంగా మారిందని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు సమోసా హై కేలరీ వంటకం. మొదట్లో కూరగాయలతో సాదాసీదా సమోసా తయారు చేసేవాళ్లు. ఇప్పుడు మాంసం, డ్రై ఫ్రూట్స్, ఉల్లి మిక్స్ చేసి తగినంత ఉప్పు దట్టించి మరింత స్పైసీగా సమోసా చేస్తున్నారు.  స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సమోసాను మార్చేశారు. దాంతో ప్రపంచంలోనే తొలి ఫాస్ట్‌ఫుడ్‌గా సమోసా రికార్డు కొట్టింది.

 

సమోసా తయారీలో అల్లం, జీలకర్ర, కొత్తిమీర, మిరియాలు.. ఇలా ఎన్నో ఉపయోగిస్తారు. సమోసాపై ఎవరికి వారు నిత్యం ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.కాలం మారే కొద్దీ పెళ్లి విందులు, శుభకార్యాల్లో సమోసా భాగమైపోయింది. పంజాబ్‌లో పన్నీర్ సమోసా కామన్. ఢిల్లీలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి చేసే సమోసాలు ఫేమస్.బెంగాల్‌లో స్వీట్ సమోసా ఇష్టపడతారు. ఢిల్లీలోని రెస్టారెంట్లలో చాక్లెట్ సమోసాలు కూడా దొరకుతాయి. సమోసా కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. బ్రిటీషర్లు కూడా సమోసాలు ఇష్టంగా తింటారు. బ్రిటన్ వెళ్లిన భారతీయులు అక్కడి వారికి సమోసాలను పరిచయం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: