మనిషి బ్రతకడానికి గాలి ఎంత ముఖ్యమో. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి దేహమంతా రక్తప్రసరణ జరగడం అంతే ముఖ్యం.. ఇదే కాకుండా మొత్తం మన శరీర బరువులో రక్తం బరువు దాదాపుగా 7 శాతం వరకు ఉంటుంది. ప్రతి వ్యక్తిలో దాదాపుగా 4.5 నుంచి 5.5 లీటర్ల వరకు రక్తం ఉంటుందని చెబుతారు. అయితే ఆడ, మగ, బరువు, ఎత్తు, ఆరోగ్య స్థితి వంటి అనేక అంశాల వల్ల రక్తం పరిమాణం మారుతుంది. ఇక మన శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను చేర వేసే కర్తవ్యాన్ని రక్తం నిర్త్వహిస్తుంది. అలాగే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా చూడడంలోనూ రక్తం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక్కోసారి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే మనకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాం..
రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే కిడ్నీలపై ఆ ప్రభావం పడుతుంది. దీంతో పాదాలు, చేతుల్లో నీరు చేరుతుంది. దీన్ని ఎడిమా అని పిలుస్తారు. ఈ క్రమంలో పాదాలు, చేతులు ఉబ్బిపోయి కనిపిస్తాయి. ఇదే కాకుండా తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. శరీరం మాటి మాటికీ చల్లబడుతుంటుంది. చలిగా అనిపిస్తుంది. చిన్న చిన్న పనులకే బాగా అలసిపోతుంటే శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని గ్రహించాలి. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా పురుషుల్లో అంగ స్తంభనలు ఉండవు. శృంగారంపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారిలోనూ రక్త సరఫరా తక్కువగా ఉంటుంది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాగే మలబద్దకం కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏకాగ్రత ఉండక, మతిమరుపు వస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గే అవకాశం ఉంది. పలు మార్పులు జీవక్రియల్లో చోటు చేసుకుంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పనితీరు దెబ్బ తిని రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
ఇకపోతే ఆకలి లేకపోయినా, చర్మం రంగులో మార్పులు కనిపిస్తున్నా.. రక్త ప్రసరణ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి. శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే గోళ్లు, వెంట్రుకలు బలహీనంగా మారిపోతాయి. వాటి పెరుగుదల ఆగిపోతుంది. కాళ్లలో రక్తం గడ్డకట్టడం, రక్తనాళాలు వాపులకు గురై బయటకు కనిపించడం.. తదితర లక్షణాలు కనిపిస్తున్నా శరీరంలో రక్త సరఫరా సరిగ్గా లేదని తెలుసుకోవాలి. తక్షణమే డాక్టర్ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.