సాధారణంగా పనసపండు తెలియన వారుండరు. ప్రపంచంలోనే అతి పెద్ద పండును ఇచ్చే చెట్టు ఇదే. సువాసనలు వెదజల్లుతూ నోరూరించే పనసపండు అంటే అందరికీ ఇష్టమే. పనసపండులో శరీరారోగ్యాన్ని పెంపొందింపచేసే పలు పోషక పదార్ధాలు పుష్కలంగా వుంటాయి. పనసపండులో విటమిన్ ఎ, విటమిన్ సి తో పాటు మెగ్నీషియం, ఫైబర్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడతాయి. పనస పండులో ఉన్న పొటాషియం రక్తపోటును అదుపు చేస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే గుండెకు సంబంధించిన సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు.
పనస జీర్ణశక్తిని పెంచుతుంది. పనసపండులో ఉన్న విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. జుట్టుకు బలాన్ని ఇస్తుంది. గర్భిణీలు పనసకాయ తినడం వల్ల వండర్ ఫుల్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. పరిమితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి గర్భశ్రావాలు జరగవు. అదేవిధంగా పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుందని విశ్వసిస్తారు. పనసకాయలో విటమిన్ బి6 మరియు ఇతర న్యూట్రీషియన్స్, యాంటీఆక్సిడెంట్స్ లు ఎక్కువగా ఉంటాయి.
ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది. పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అజీర్తి, అల్సర్ల సమస్యను కూడా నయం చేస్తుంది. బాగా మగ్గిన పండు మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా దోహదపడుతుంది. చర్మ, కేశ ఆరోగ్యానికి కూడా ఔషధంగా పనిచేస్తుంది. సో.. పనసపండు దొరికితే తినడం అస్సలు మిస్ కావొద్దు.