కరోనా ఎఫెక్ట్తో విమానాయన రంగం అల్లకల్లోలం అవుతోంది. వైరస్ వ్యాప్తికి విదేశీయులే ఎక్కువగా కారణమవుతున్నారనే వైద్య వర్గాలు ధ్రువీకరిస్తున్న వేళ చెన్నై విమానాశ్రయానికి వివిధ దేశాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 50 విమాన సర్వీసులను రద్దు చేశామని అధికారులు తెలిపారు. దీంతోపాటు దేశంలోని పలు మెట్రో నగరాలకు సర్వీసులను రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. దాదాపు 34 డొమెస్టిక్ విమాన సర్వీసులను కూడా కరోనా భయంతో రద్దు చేశామని అధికారులు వివరించారు. తెలంగాణ, మహారాష్ట్, కర్నాటక రాష్ట్రాలు తీసుకుంటున్న కరోనా కట్టడి చర్యలతో తమిళనాడు ప్రభుత్వం కూడా నాలుగు రోజులు కఠినమైన ఆంక్షలను విధిస్తూ వస్తోంది. రోడ్లన్నీ కూడా కర్ఫ్యూ విధించినట్లుగా మారిపోయాయి.
ఇక్కడ నుంచి సేవలందిస్తున్న పలు అంతర్జాతీయ, జాతీయ ప్రైవేటు సంస్థలు ఇప్పటికే వర్క్ ఫ్రం హోంకు ఆదేశాలు జారీ చేశాయి. తమిళనాడులో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ప్రజలు ప్రయాణాలను వాయిదాల వేసుకోవాలని కోరుతోంది. రెండు రోజుల క్రితం మొదట మార్చి 12 న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతూ రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలకు పంపడంతో బుధవారం పాజిటివ్గా రిపోర్టు వచ్చింది.
ఢిల్లీ నుంచి చెన్నైకి రైలు మార్గం ద్వారా చేరుకున్నాడు. నగరంలోని కొంతమంది స్నేహితులతో కలసి ఉండటంతో ఇప్పుడు వారిని కూడా పరీక్షిస్తున్నారు. అయితే వారిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నట్లుగా సమాచారం. పాజిటివ్ రిపోర్టు వచ్చిన యువకుడిని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. రోగి ఒంటరిగా ఉన్నారని, ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని ఆరోగ్య మంత్రి సి.విజయ భాస్కర్ ట్వీట్ చేశారు. ప్రజలెవరూ భయపడవద్దని ప్రభుత్వం వైద్యశాఖను అప్రమత్తం చేసిందని అన్నారు. ప్రజలు తమవంతుగా ప్రభుత్వ ఆదేశాలను పాటించడంతో పాటు అవగాహనను పెంపొందించుకోవాలని సూచించారు.