కరోనా మహమ్మారిని చూసి అతిగా భయపడాల్సిన అవసరం లేదని దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి (బాబాయ్ కుమార్తె) ప్రముఖ వైద్యురాలు సునీతారెడ్డి స్పష్టం చేస్తున్నారు.కరోనాపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆమె మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. కరోనా జబ్బు వచ్చినప్పటికీ ఆ రోగులు 80 శాతం తొందరగానే కోలుకుంటున్నారని అన్నారు. అయితే కరోనా వ్యాధికి గురైన వారు కరోనా ఇన్ఫెక్షన్ ఉందని తెలిసినప్పుడు వాటి లక్షణాలను బట్టి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అయితే తెలియనప్పుడు కూడా ఒళ్లు నొప్పులుంటే నొప్పికి మందులు తీసుకుంటాం.. జ్వరం ఉంటే పారాసిటమాల్.. దగ్గు ఉంటే దగ్గు మందు తీసుకోవచ్చు ఇబ్బందేమీ ఉండదని అన్నారు.
వీటన్నింటికంటే విశ్రాంతి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కరోనా లక్షణాలు ఉన్నట్లు మీకు అనిపిస్తే వెంటనే దగ్గర్లోని వైద్య కేంద్రానికి వెళ్లి పరీక్షలకు వైద్యులచే సిఫార్సు చేయించుకోవడం ముందు చేయాల్సిన అతి ముఖ్యమైన పని అన్నారు. అయితే కరోనా అనగానే చాలామంది అత్యంత ప్రమాదకరమని ఊహించుకోవడం సరికాదని చెప్పారు. వ్యాధికి గురైన వారిలో దాదాపు 80శాతం మంది అత్యంత తొందరగానే ఆరోగ్యవంతులుగా మారుతున్న విషయాన్ని మనం గుర్తించాలని అన్నారు. ఇందుకు చైనాలోని వేలాదిమంది ఈ వ్యాధి నుంచి బయటపడిన విషయాన్ని గుర్తెరగాలని చెప్పారు. అయితే వ్యాధి సోకిన వారు కచ్చితంగా క్వారంటైన్ పాటించాలని అన్నారు.
క్వారంటైన్ అంటే ఎవరికీ సమీపంలో ఉండకుండా ఏకాంతంగా చికిత్స తీసుకోవడం అని వివరించారు. క్వారంటైన్లో ఉన్న వారు మానసిక ప్రశాంతత కోసం తమకు ఇష్టమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులతో ఫోన్లలో మాట్లాడొచ్చు. మ్యూజిక్ వినొచ్చు. మరీముఖ్యంగా మెడిటేషన్ కూడా వారికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. అలాగే ఎంతో మానసిక ధైర్యాన్నిస్తుందని చెప్పారు. ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యంగా ఉండటం అనేది కూడా ముఖ్యమే. ఎంతసేపూ కూర్చోనే ఉంటే బాడీ వీక్గా మారుతుందని అన్నారు. హెల్తీగా తినడం కూడా ముఖ్యమేనని సూచించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో కంపార్ట్గా ఉండాలి అదే రోగిని ప్రమాదం నుంచి బయట పడేస్తుందని ఆరోగ్య సలహా ఇచ్చారు.