తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడా కూడా జనం గుమికూడా ఉండాలని, ఇందుకోసం 144 సెక్షన్ను కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఆయన హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వ్యాధి వ్యాప్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక్కడ నమోదవుతున్న కేసులన్నీ కూడా విదేశాల నుంచి వస్తున్న వారి కారణంగానే ఉంటున్నాయని అన్నారు.
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చే వారు స్వచ్ఛందంగా తమ వివరాలను స్థానిక అధికారులకు తెలపాలని కోరారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించడం వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నియంత్రించే అవకాశం ఉంటుందని తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణలో ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు ఇప్పటివరకు రాష్ట్రంలో 14 కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా వీరందరికీ కూడా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందుతోందని, ఎవరూ కూడా వెంటీలేటర్పై లేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1160 మంది క్వారంటైన్లో ఉన్నారని అన్నారు.
ఈ సంవత్సరం ఉగాది శ్రీరామనవమి ఉత్సవాలను రద్దు చేశామని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా తమ వివరాలను అందజేయాలని ఇది సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. ప్రభుత్వం ముందుగా చెప్పిన ప్రకారం ఈ నెల 31 వరకు ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని అన్నారు. తదనుగుణంగానే అధికారులు కూడా కఠినమైన నిబంధనలను అమలు చేయాలని అన్నారు. మ్యారేజ్ హాల్స్ ను ఇప్పటికే చాలావరకు మూసి వేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా కొనసాగిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు బాధ్యతాయుతంగా మెదిలి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.