భారత్లో గంటల వ్యవధిలోనే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠినమైన నిర్ణయాలను అమల్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ప్రధానమంత్రి మోదీ ఈనెల 22న జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా అనేక అనుమానితులు ఆస్పత్రులకు తరలివెళ్తున్నారు. కొత్తగా వేలాది సంఖ్యలో అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. అంకెల్లోంచి సంఖ్యల్లోకి అది గంటల వ్యవధిలోనే పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం చైనాలో అమలు పర్చుతున్న కఠిన నియామాలను అమల్లోకి తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే చైనాలో సాధ్యమైన ఆ నియామాలు ఇక్కడ ఎంత వరకు అమలుకు నోచుకుంటాయన్నది కూడా అనుమానమే. భారత ప్రజలు అందుకు సిద్ధంగా ఉన్నారా..? ప్రజలు కాదు ముందు వ్యవస్థలు కూడా అంత సన్నద్ధతలో ఉన్నాయంటే చాలా వరకు లేవనే సమాధానం వస్తోంది. చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ఆ దేశాన్ని తీవ్ర ప్రభావితం చేసి..ఇటలీలో ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. స్టేజి త్రీలోకి వెళ్లడంతో కట్టడికి ఆ దేశ ప్రభుత్వం నానా యాతన పడాల్సి వస్తోంది. వందలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. 80కి పైబడిన వృద్ధులకు చివరి ప్రాధాన్య క్రమంలో చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించడం నిజంగా బాధాకరమే అయినా ఇప్పుడు ఇటలీలో ఉన్న వైద్య సదుపాయాలు, సౌకర్యాలు, డాక్టర్ల కొరత కారణంగా అంతకు మించిన వేరే గత్యంతరం లేదు.
భారత్కు అంత దుస్థితి రాకపోవచ్చు. పక్క దేశాల్లో మరణ మృదంగం మోగుతుండగా వైరస్ వ్యాప్తికి తూతూ మంత్రం చర్యలు,
పొడిపొడి మాటలతో, అధికార యంత్రాంగాల హైరానా చేయడంతోనే సరిపోతున్నాయన్న విమర్శలు కొంతమంది మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో నిర్భంద చర్యలే ప్రమాదాన్ని నివారించగలవని పేర్కొంటున్నారు. స్వచ్ఛందంగా అని ప్రజలకు వదిలేస్తే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని హెచ్చరిస్తున్నారు. చైనాలో అమలు చేస్తున్న కఠిన గృహ నిర్బంధ విధానాలనే ఇక్కడ అమలు చేసి వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న సమయంలోనే అరికట్టాలని కోరుతున్నారు.