కరోనా రక్కసి ప్రజల ప్రాణాలను మింగేస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 11400మందికి పైగా కరోనా వ్యాధితో మరణించినట్లు ఆయా దేశాలు వెల్లడించిన లెక్కల ప్రకారం మీడియాలో వస్తున్న కథనాలను బట్టి తెలుస్తోంది. గడిచిన 24గంటల్లోనే దాదాపు 1400 మందికి పైగా కరోనా కభళించింది. ఈ మహమ్మారికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలియక ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 11,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య 2.76 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,400 మంది మృతిచెందారంటే భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.
అయితే, వైరస్ బారినపడ్డవారిలో దాదాపు 92 వేల మంది కోలుకున్నారు. మరో 1.64 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 7,900 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా తయారైంది. రోజుల వ్యవధి ముగిసి ప్రస్తుతం గంటగంటకు దీని ప్రభావం మరింత పెరిగిపోతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇర ఐరోపా ఖండలోని ఇటలీ దేశం కరోనా దెబ్బకు విలవిలాడిపోతోంది. ఇటలీలో శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 652 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో మరణాల సంఖ్య 4,000 మార్కను దాటేసింది. కొత్తగా మరో 6,497 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం తల పట్టుకుంది. ఇప్పటి వరకు ఆదేశంలో మొత్తం కేసులు 47,000 దాటడం గమనార్హం.
ఇక భారత్లో 238 పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. వైరస్ కనుగొన్న చైనాలో శనివారం ఏడుగురు చనిపోగా, 41 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 3,255కు చేరింది. స్పెయిన్లో 1093, ఇరాన్లో 1,433, ఫ్రాన్స్లో 450 మంది, అమెరికాలో 264 మంది మృతిచెందారు. అమెరికాలో బాధితుల సంఖ్య 20వేలకు చేరుకోగా, శుక్రవారం మరో 254 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం, అజాగ్రత్తలు పాటించినా ఇటలీలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారు. అందుకే భూ మండలాన్ని చుట్టిన ఈ వైరస్ను అరికట్టేందుకు దాదాపు అన్ని దేశాల్లో నిషేదాజ్ఞలు అమల్లోకి వచ్చాయి.