కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రాణాలకన్నా పనులే ముఖ్యం కాదని పేర్కొన్నారు. అత్యంత ముఖ్యమైన పని అయితేనే బయటకు వెళ్లాలని అన్నారు. కేంద్రం సూచించిన విధంగా 12గంటలు కాకుండా మన కోసం.. మన సమాజం కోసం.. మన ప్రపంచం కోసం 24గంటలు కర్ఫ్యూ పాటించి దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూలో పాల్గొనాలని అన్నారు. అయితే వృద్ధులు, చిన్నారులు మాత్రం రాబోయే మూడు వారాల వరకు కూడా ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఎంతో శ్రేయస్కరమని అన్నారు.
కరోనా వీరిపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. కావున దయచేసి వారిని ఇంటికే పరిమితం చేయాలని కోరారు. ఇక కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ర్టవ్యాప్తంగా 52 అంతర్రాష్ర్ట చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 78 టీమ్లు హైవేలపై ఇన్స్పెక్షన్ చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ సమాజం పట్టుదల, పౌరుషం ముందు కరోనా పెద్ద లెక్కకాదని తనదైన శైలిలో వ్యాఖ్యనించారు. తెలంగాణను సాధించుకున్న వాళ్లం కరోనాను కచ్చితంగా ఎదుర్కొంటామంటూ అన్నారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని, నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతాయన్న ప్రచారం మొదలైంది.
అలాంటిదేమీ ఉండబోదని అన్నారు. అలాంటి అవసరమే వస్తే తెలంగాణ సర్కారు ప్రజలందరికీ ఫ్రీగా సరుకులు అందజేస్తుందని ప్రకటించారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయనీ, విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడానికి 5274 నిఘా బృందాలు కూడా పనిచేస్తున్నాయనీ అన్నారు. రాష్ర్టంలోకి 25వేల మంది విదేశాల నుంచి వచ్చారని, అందులో 11వేల మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిన్నఒక్కరోజే 1500మంది వచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిపుణులతో రాష్ర్టంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.