భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్టేజి దశలోకి వెళ్లిపోతోందా..? అంటూ అవుననే సమాధాన దొరికింది. ఇన్నాళ్లు విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) సోకిన నేపథ్యంలో తాజాగా తెలంగాణలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కరోనా కేసు నమోదైంది. తొలిసారి స్థానికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్యాధికారులు గుర్తించారు. P14 కేసు ద్వారా సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. కూకట్పల్లిలో ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. . అయితే హైదరాబాద్కు చెందిన ఓ యువకుడి విదేశాల్లో ఉంటూ ఇండియాకు తిరిగి వచ్చాడు. రెండు రోజుల పాటు కుటుంబసభ్యుల మధ్య గడిపాడు.
వారం రోజుల క్రితం సదరు యువకుడితో పాటు ఇద్దరు కుటుంబసభ్యులు కరోనా లక్షణాలతో ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. అయితే యువకుడికి మూడు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ రాగా అతడి సోదరికి శనివారం సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశమని వైద్యులు వెల్లడిస్తున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు 19 మంది కరోనా పాజిటివ్గా తేలిన విషయం తెలిసిందే. వారిలో 16 మందికి గాంధీ ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తుండగా.. మరో ఇద్దరిని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. మరొకరికి నయం కావడంతో డిశ్చార్జి చేసినట్లు సమాచారం.
ముఖ్యమంత్రి శనివారం సాయంత్రం విలేఖరుల సమావేశంలో కరోనా కంట్రోల్లోనే ఉందని చెప్పిన కొద్ది నిముషాల తేడాలోనే కొత్త కేసు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా... కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూకు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలనుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఒకరోజు పనులు మానుకుని కుటుంబంతో ఇంట్లోనే గడిపేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే అత్యవసర సేవలకు సంబంధించి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా చూస్తామని చెప్పారు.