భారత్లో గంటగంటకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ పోతునే ఉన్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుందోమేనన్న భయం కలిగిస్తోంది. శుక్రవారం 175 పాజిటివ్ కేసులుండగా శనివారం రాత్రి 283 కేసులకు పెరిగినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది. అయితే ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం 315కేసులు కేసులు నమోదైనట్లు పేర్కొంది. భారత్లో ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అన్న టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉండగా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతున్నట్లుగా వైద్య నిపుణులు నిర్ధారణ చేశారు. హైదరాబాద్, పుణెలకు చెందిన ఇద్దరికి ఇలానే వచ్చినట్లుగా తేలింది.
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఏరిస్థితి ఎదురైన ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వెయ్యి పడకలతో ప్రాంతాల వారీగా ఆస్పత్రులను సిద్ధం చేస్తున్నారు. భారత ఆరోగ్య పరిశోధన మండలి (ICMR) పాజిటివ్ వివరాలను ప్రకటించింది. మొత్తం 16 వేల 021 మంది నుంచి 16 వేల 911 నమూనాలను సేకరించినట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు రికార్డవుతున్నాయి. అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరస్ బారిన పడుతున్నారు. ప్రధానంగా తెలంగాణలో క్రమక్రమంగా కేసులు అధికమౌతున్నాయి. శనివారం నాటికి 21 కేసులకు చేరగా..ఏపీలో ఐదు కేసులు రికార్డయ్యాయి.
కరోనా కారణంగా ఇప్పటి వరకు భారత్లో ఐదుగురు మృతిచెందారు. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వ్యాప్తి అధికమైతే మాత్రం ఊహించని పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇది కొనసాగనుంది. ప్రజలు బయటకు రాకుండా..ఇళ్లల్లోనే గడుపుతున్నారు. వ్యాపారస్థులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి.