తెలంగాణలో రెండోదశ దాటి కరోనా వైరస్ చాపకింద నీరులా మూడో దశకు చేరుకుంటోందా..? ప పెరుగుతున్న అనుమానిత కేసుల్లో ఈ కోవకు చెందినవి ఉన్నాయా అంటే వైద్య వర్గాలు కొట్టి పారేయడానికి వీల్లేదని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నిర్ధారణ అయిన వాళ్లు వైద్య కేంద్రాలకు ఆలస్యంగా చేరారు. ఇక్కడికి రావడానికి ముందు ఒక్కోరు కుటుంబసభ్యులతో పాటు వారి పరిచయస్తుల మధ్య మెదిలి ఉండటం వారిలోనూ కరోనా లక్షణాలు ఉండటాన్ని బట్టి ప్రస్తుతం మూడో దశలోకి కరోనా వైరస్ ఎంటర్ అయినట్లుగానే భావించాల్సి ఉంటుందని అన్నారు. దీంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ప్రెస్మీట్లో ఏం చెప్పబోతున్నాడు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే నిర్ధారణ పరీక్షల ఫలితాలు కొన్ని పెండింగ్లో ఉండటం చేత ఇప్పటికిప్పుడే అంచనాకు రాలేమని చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి రెండో దశలో ఉంది. వైరస్ వ్యాప్తి మూడో దశ (సామాజిక వ్యాప్తి–కమ్యూనిటీ ట్రాన్స్మిషన్)లోకి వ్యాపించడానికి దేశానికి కేవలం 30 రోజులు గడువే ఉంటుంది. వైరస్ మూడు, నాలుగు దశలు దాటిపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే వైద్య సదుపాయాలకు కొరత ఏర్పడటంతో పాటు అనేక ఇతర ఇబ్బందులకు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని చెబుతున్నారు.
ప్రస్తుతం చైనా, ఇటలీలో ఏం జరుగుతోందో అంతకన్నా ఎక్కువగా భారత్లో ప్రమాద సంకేతాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. మూడో దశలో వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందంటే రెండో దశలో వైరస్ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల ఉన్న వారికి పెద్దెత్తునవైరస్ విస్తరిస్తుంది. చాలా తక్కువ సమయంలోనే వేలాది మందికి విస్తరిస్తుంది. మరణాల సంఖ్య భారీగా ఉంటుంది. నియంత్రణ కష్టమవుతుంది. ఇటలీ, ఇరాన్లు ప్రస్తుతం ఇదే దశను ఎదుర్కొంటున్నాయంటూ వైద్యులు చెబుతున్నారు. ఇక నాలుగో దశలో అయితే వైరస్ నియంత్రణ చేయి దాటిపోయి అదుపులోకి తేవడం అన్నది అసాధ్యంగా మారే పరిస్థితులుంటాయని హెచ్చరిస్తున్నాయి.