తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే చేస్తోంది. కఠిన చర్యలను అమల్లోకి తీసుకువస్తోంది. ఇబ్బడిముబ్బడిగా రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు జరిమానాలు విధించడమే కాదు..జైళ్లకు పంపేందుకు ఎపిడికో చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తోంది. కరోనా పాజిటివ్ అనితెలిసినా కుమారుడిని క్వారంటైన్లో ఉంచకుండా ఇంటికి తీసుకెళ్లిన కొత్తగూడెం డీఎస్పీ ఎస్ఎం అలీపై పోలీసుశాఖ తీవ్రంగా స్పందించింది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. బాధ్యతాయుతమైన అధికారి హోదాలో ఉండి కూడా అలీ వ్యవహరించిన తీరును పోలీస్శాఖ తప్పుబట్టింది. డీఎస్పీ ఎస్ఎం అలీ కొడుకు లండన్లో చదువు కొనసాగిస్తున్నాడు.
ప్రపంప వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడి యూనివర్సిటీ మూసివేయడంతో.. ఆ విద్యార్థి ఇటీవల కొత్తగూడెం చేరుకున్నాడు. ఆ తర్వాత జలుబు, దగ్గు, జ్వరం రావడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్య అధికారులను సంప్రదించారు. ప్రాథమిక పరీక్షలు చేసిన వైద్యులు.. కరోనా లక్షణాలున్న ట్టుగా గుర్తించి వెంటనే అత్యవసర వాహనంలో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి శనివారం తరలించారు. అక్కడ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించి అతడికి కరోనా లక్షణా లున్నట్లుగా నిర్ధారించారు. అయితే వైద్యుల సలహా పక్కనపెట్టి మరీ క్వారంటైన్ నుంచి కుమారుడిని డీఎస్పీ ఇంటికి తీసుకెళ్లడం గమనార్హం.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదుకు ఆదేశించారు.ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వచ్చి ఎలాంటి వివరాలు తెలపకుండా ఉన్నవారి జాబితాను సిద్ధం చేసిన అధికారులు వారిపై కోవిడ్-19 చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి అవసరమైతే జైళ్లకు కూడా పంపే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ప్రజలను రోడ్లపైకి రాకుండా, వైరస్ అనుమానిత లక్షణాలు కలిగిన వారిని నిర్బంధంగా ఆస్పత్రులకు తరలించేలా పోలీస్శాఖకు విశేషమైన అధికారాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తచట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.