కరోనా పేగు బంధాన్ని మెలిపెడుతోంది..కడసారి చూపులకు కూడా దూరం చేస్తోంది. కనీ పెంచిన తండ్రిని చివరిసారి కళ్లరా చూసుకోలేకపోతున్నామే....అయ్యో ఏంటీ ఘోరం..మాకెందుకు ఈ శాపం అంటూ రోధించేలా చేస్తోంది. అనుక్షణం కరోనా రక్కసిని తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. తండ్రి మరణించినా ఊరికి చేరుకునే మార్గం లేకపోవడంతో చివరికి అంత్యక్రియలను ఆన్లైన్లో వీక్షించాల్సిన దుస్తితి నెలకొంది. ఈ ఘోర విషాద సంఘటన వరంగల్ అర్భన్ జిల్లాలో చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన కోరెం ప్రభాకర్ రెడ్డికి ఇద్దరు సంతానం.
కుమారుడు సాయి క్రిష్ణారెడ్డి ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేస్తుండగా, కుమార్తె నితీషా రెడ్డి బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తోంది. ప్రభాకర్ రెడ్డి మంగళవారం తీవ్రమైన గుండె పోటుతో మృతి చెందాడు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో విదేశాల్లో ఉన్న మృతుడి పిల్లలు కన్న తండ్రిని చివరి చూపు చూసుకోలేని పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితులలో కట్టుకున్న భార్య తలకొరివి పెట్టింది. ఈసంఘటన తెలిసిన దగ్గరి బంధువులు అంతా అయ్యోపాపం అంటూ విలపిస్తున్నారు...కానీ ఎవరూ దగ్గరికి వెళ్లలేని పరిస్థితి. అంత్యక్రియలకు కూడా ఎక్కువ మంది కాకుండా కేవలం కుటుంబసభ్యులను మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు.
అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసిన తమ తండ్రిని ఇలా ఈ లోకం నుంచి సాగనంపాల్సి రావడంపై ఆయన కుమారులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయ్యో నాన్న ఎంటీ నీకు ఈ గతి అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మాకోసం నువ్వు ఎంత కష్టపడ్డావ్..కనీసం నీకోసం...నీ చివరి చూపు కోసం మేం రాలేకపోతున్నామే అంటూ దుఃఖించారు. నిత్యం మాగురించి ఆలోచించే నాన్నకు..మేమే లోకమైన మా నాన్నకు ఏం చేయాలేదు..అంటూ ఉద్వేగం చెందారు. ఇలాంటి పరిస్థితి ఏ కన్నబిడ్డలకు రాకూడదు అంటూ వేదన చెందుతున్నారు. నిజమే కరోనా చితిమంటల సాక్షిగా బంధాలను తెచ్చేస్తోంది. బతికి ఉన్నన్నాళ్లు తీరని బాధను వెంటాడేలా చేస్తోంది.