కరోనా వైరస్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మహమ్మారి గురించే హాట్ టాపిక్గా మారింది. మొదట చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే ప్రపంచదేశాలు విస్తరించి.. ప్రజలను నానా ఇబ్బందులు పెడుతోంది. ముఖ్యంగా కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 లక్షల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 2.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే, 10 లక్షల మంది కోలుకున్నారు. మరో 20 లక్షల మంది వైరస్తో పోరాడుతున్నారు. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియా వేదిక కరోనాపై ఎన్నో ప్రచారాలు ఊపందుకున్నాయి. వాటిలో ఏది నిజం.. ఏది అబద్ధం అన్నది తెలియక ప్రజలు అయోమయంలో పడుతున్నారు. ఇక తాజాగా నువ్వుల నూనెతో కరోనా వైరస్కు చెక్ పెట్టవచ్చు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి నువ్వులు భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి.
కాబట్టి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివన్న విషయం అందరికీ తెలుసు. అయితే తాజాగా నువ్వుల నూనెతో కరోనాను నాశనం చేయవచ్చని.. అందుకు నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు. నువ్వుల నూనెతో కరోనా వైరస్ను అడ్డుకోవచ్చు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. వాస్తవానికి కరోనా వైరస్ను చంపే కెమికల్స్ ఉన్నాయి. బ్లీచ్, క్లోరిన్ బేస్డ్ డిస్ఇన్ఫెక్టెంట్, పెరాసిటిక్ యాసిడ్, క్లోరోఫామ్ లాంటి కెమికల్స్తో కరోనా వైరస్ను చంపొచ్చు.
అలాగని వాటిని చర్మానికి పూసుకుంటేనో, ముక్కులో డ్రాప్స్ వేసుకుంటేనో కరోనా వైరస్ను అడ్డుకోవచ్చనుకుంటే చాలా పొరపాటు. దీనివల్ల మీ శరీరంతో పాటు ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి అసత్య ప్రచారాలు ఇటీవల ఎన్నో జరుగుతున్నాయి. వాటిని గుడ్డిగా మాత్రం నమ్మకండి.