సాధారణంగా మనిషి జీవించేందుకు భోజనం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అయితే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా హడావిడిగా భోజనం చేయడం అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీని కారణంగా ఎంత తింటున్నామో తెలియదు కూడా. ఇక చాలామంది తినేటప్పుడు నీరు తాగుతుంటారు. ముద్ద ముద్దకి నీరు తాగేవారు ఉన్నారు. అమ్మ చీవాట్లు పెట్టినా.. పట్టించుకోకుండా గడగడ నీళ్లు తాగేవాళ్లు ఉన్నారు.
కానీ, తినేటప్పుడు ఎక్కువగా నీరు తీసుకుంటే.. దీనివల్ల జీర్ణక్రియ పనితీరు తగ్గుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇలా భోజనం చేసేటప్పుడు ఎన్నో నియమాలు ఉంటాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే భోజనం నెమ్మదిగా తినడం వల్ల కూడా ఎన్నో లాభాలు పొందవచ్చు. మరి అవేంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఆకలి, క్యాలరీలను హార్మోన్లు నియంత్రించేలా ఉండకూడదు. వేగంగా, సరిగ్గా నమలకుండా భోజనం చేసేవారిలో గ్రెలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. ఇది ఆకలిని తగ్గించేస్తుంది. అదే సమయంలో మిగిలిన హార్మోన్లమీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
ఈ హార్మోన్లు మీ మెదడుకు తప్పుడు సంకేతాలని అందివ్వడం మూలంగా, ఆ ప్రభావం తీసుకునే ఆహారం మీద పడుతుంది. నిజానికి ఈ ప్రక్రియ మొత్తానికి కనీసం ఇరవై నిమిషాలు పడుతుంది. కాబట్టి భోజనం నెమ్మదిగా తినడం వల్ల.. మీ మెదడుకు మంచి సంకేతాలను పొందడానికి అవసరమైన సమయం దక్కుతుంది. అంతేకాకుండా.. నెమ్మదిగా తినడం ఫుల్నెస్ హార్మోన్లను పెంచుతుంది. ఆహారం కూడా మితంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక సాధారణంగా అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారిలో సంపూర్ణ హార్మోన్లు అంతగా పెరగవు. కానీ, ఊబకాయం ఉన్న వ్యక్తులు నెమ్మదిగా భోజనం తినడం వల్ల పూర్తిస్థాయిలో హార్మోన్లను పొందినట్లు పరిశోధకులు తేల్చారు. కాబట్టి.. ఓ హడావుడిగా భోజనం చేయడం మానేసి కాస్త నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి.