ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. వేసవి వస్తూ వస్తూనే తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే చాలా మంది చల్లదనానికి, చల్ల నీటికి, చల్లటి ఆహార పదార్థాలకు ప్రజలు మొగ్గు చూపుతారు. మరియు స్నానం చేయడానికి కూడా చన్నీటినే ఉపయోగిస్తుంటారు. ఇక చన్నీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చన్నీటి స్నానం ఒత్తిడి, డిప్రెషన్ తదితరాలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణ మెరుగు పరుస్తుంది.
అయితే చన్నీటి స్నానం వల్లే కాదు వేడి నీటి స్నానం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. వేడినీరు శరీరానికి ఉపశమనం కలిగించేది మాత్రమే కాకుండా, శరీర కండరాలకు కూడా విశ్రాంతిని ఇస్తాయి. తద్వారా మీ శరీరానికి భౌతికంగా మరియు మానసికంగా సడలింపు లభించినట్లవుతుంది. మానసిక ప్రశాంతత తోడై, మంచి నిద్రకు సహాయపడగలదు. అలాగే వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏరోబిక్స్ చేయడం వల్ల కలిగే ఫలితాలతో సమానమని తెలిపారు. అదేవిధంగా, ప్రతి రోజు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులతో పాటు పక్షవాతం బారిన పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇక వ్యాయం చేయని వారు రోజూ వేడినీటి స్నానం చేయడం ద్వారా కొంత వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందని పరిశోధకులు ఇటీవల జరిపిన పరిశోధనలో తేల్చారు. ఇక మధుమేహంతో బాధపడుతున్న రోగులు క్రమం తప్పకుండా వేడినీటితో స్నానం చేయడం మూలంగా 2.5 పౌండ్ల బరువును కోల్పోతారని అధ్యయనాలలో తేలింది. వేడినీటి స్నానం రక్తంలోని గ్లూకోజ్ మరియు చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది. వేడి నీటి స్నానం వల్ల నాడీవ్యవస్థ విశ్రాంతికి లోనవడం, నొప్పి మరియు వాపు తగ్గడం వంటి చర్యలకు దోహదపడడమే కాకుండా ఒత్తిడి మరియు ఆందోళనను కూడా తగ్గిస్తుంది.