ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇన్నాళ్లు చలితో వణికి పోయిన ప్రజలు ముదురుతున్న ఎండలు చమటలు పట్టిస్తున్నాయి. బయట అడుగు పెడితే ఎండ వేడికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక ఆ సమస్య రాకుండా ఉండాలని కొందరు చల్లని డ్రింక్స్ వైపు పరుగులు పెడుతున్నారు. ఇంకా కొందరు అస్తమానం ఫ్రిజ్లోని కూలింగ్ వాటర్ తాగుతున్నారు. కానీ, తాగే నీరు ఎంత చల్లగా ఉంటే.. అంతగా దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లటి నీటి వల్ల గొంతులో మ్యూకస్ అనే జిగురు పదార్థం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
దీని వల్ల గొంతు, ఊపిరితిత్తులలోని రోగనిరోధక శక్తి తగ్గిపోయి త్వరగా దగ్గు, జలుబు వంటి అనారోగ్యాలు పలకరిస్తాయి. అలాగే కూలింగ్ వాటర్ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇక ఆహారం తినేప్పుడు పక్కనే కూల్ వాటర్ బాటిల్ కనిపిస్తే చాలు.. ముద్దకో గుక్కుడు నీళ్లు తాగేస్తుంటారు. అలా చేయడం ఏ మాత్రం మంచిది కాదట. కూలింగ్ వాటర్ వల్ల వాత, కఫ, పిత్త దోషలు ఏర్పడి జీర్ణద్రవాల పనితీరు మందగిస్తుంది. అందుకే, ఆహారం తినేప్పుడు చల్లని నీటికి బదులు గది ఉష్ణోగ్రతతో సమానంగా ఉండే నీటినే తాగాలంటున్నారు.
అదేవిధంగా, చల్లని నీటిని తాగితే గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. చల్లని నీళ్లు పదో కపాల నాడి వేగస్ను ప్రేరేపిస్తాయి. నాడీ వ్యవస్థలో దీనిదే కీలకపాత్ర అవడం వల్ల చల్లని నీటిలోని తక్కువ ఉష్ణోగ్రతలు ఈ నాడిపై ప్రభావం చూపిస్తాయి. ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది. దీంతో రక్త సరఫరా సరిగా జరగదు. ఫలితంగా అవయవాలకు పోషణ సరిగ్గా అందదు. ఇక చాలామందికి వ్యాయమం చేస్తూ చల్లని నీటిని తాగే అలవాటు ఉంటుంది. అలా అస్సలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయమం చేసే సమయంలో శరీరం నుంచి వేడి ఉత్పత్తి అవుతుందని, వెంటనే నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలలో సమతుల్యత దెబ్బతింటుందని అంటున్నారు నిపుణులు.