మానవాళిని మహా సంక్షోంభంలోకి నెట్టిన కరోనా వైరస్ రక్కసి త్వరలోనే భారత్ నుంచి వెళ్లిపోతుందంట. ఈ విషయంపై కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, నిపుణులు కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భారత్లో కరోనా సంక్షోభానికి త్వరలో ముగింపు పడనుందని బలంగా చెబుతున్నారు. సెప్టెంబర్లో ఈ సంక్షోభం సమసిపోతుందని ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలో కేసులు పెరుగుతున్న తీరును ఆధారంగా చేసుకుని వారో థియరీ వినిపిస్తున్నారు. ఓ మ్యాథమేటికల్ మోడల్ సాయంతో వారు ఈ అంచనాకు రావడం గమనార్హం.
ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎపిడెమియోలాజీ ఇంటర్నేషనల్ అనే ఆన్లైన్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మ్యాథమేటికల్ మోడల్ థియరీని తయారు చేసిన వారు డీజీహెచ్ఎస్కు చెందిన అనిల్ కుమార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, రూపాలీ రాయ్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ కావడం విశేషం. బెయిలీ మ్యాథిమెటికల్ మోడల్ అధారంగా, జనాభా వాతావరణ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఈ ఇద్దరు ఈ మోడల్ను రూపొందించారు. ఈ మోడల్ ప్రకారం కరోనానుంచి కోలుకున్న వారి, మరణించిన వారి మొత్తం సంఖ్య కొత్తగా నమోదవుతున్న కేసులతో సమానమైనప్పుడు కరోనా సంక్షోభం సమసిపోయే స్థితి వస్తుందని పేర్కొంటున్నారు.
అయితే ఇప్పుడున్న గణాంకాల ఆధారంగా సెప్టెంబర్ నెల 15 నాటికి భారత్ ఈ స్థితికి చేరుకుటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్లో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 9 వేల పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం రాత్రికి భారత్లో కేసుల సంఖ్య 2,45,670కి చేరింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే.. మన దేశం కంటే ముందున్నాయి. శనివారం ఉదయం 8 గంటలకు గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 9,887 కేసులు నమోదయ్యాయని, 294 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.