కరోనా వైద్య విధానంలో దేశంలో మరే రాష్ట్రం చేయలేని రిస్క్...తలపెట్టని విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంభించేందుకు శ్రీకారం చుట్టింది. వైద్య వర్గాల నుంచి మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాధిపై చాలా వరకు అవగాహన వచ్చిన నేపథ్యంలో ఫర్వాలేదు..అది సరైన నిర్ణయమేననే వారూ ఉన్నారు. ఇంతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమేటంటే...కరోనా పాజిటివ్ వచ్చినా...లక్షణాలు కనిపించని వారికి ఇంటి వద్దనే చికిత్స అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్లో ఉంచి అవసరమైన ట్రీట్మెంట్ అందేలా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియను వైద్యాధికారులు ప్రారంభించడం గమనార్హం.
ఈక్రమంలోనే కరోనా సోకి గాంధీ లో ట్రీట్ మెంట్ పొందుతున్న పేషెంట్లను ఇండ్లకు పంపిస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉండి వైరస్ లక్షణాలు లేని 50 మందిని శనివారం ఇళ్లకు పంపించినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాజారావు విలేఖరులకు తెలిపారు. ఇళ్లలో ప్రత్యేకంగా గది, ఇతర వసతులు ఉన్న వారిని గుర్తించి.. వారు అంగీకారంతోనే ఇళ్లకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్దగా ఇబ్బంది లేని పేషెంట్లకు ఇంటి దగ్గరే ట్రీట్ మెంట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. రెండో విడతలో ఇండ్లలో వసతి లేని వారిని అమీర్ పేట్ లోని ప్రకృతి చికిత్సాలయం లో క్వారంటైన్ కు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
హోం క్వారంటైన్కు తరలించిన వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరోగ్య సిబ్బంది..అవసరమైతే ప్రత్యేక బృందాలు అబ్జర్వేషన్ చేస్తాయని చెప్పారు. వైద్య బృందాలు వారికి ఎళ్లవేలాల అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేకాక వారికి ఎలాంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా అవసరమైన సలహాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా భారత్లో కరోనా వైరస్ రోజురోజుకు ఉధృతమవుతోంది. చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది.భారత్లో కూడా కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.