లాక్డౌన్ మళ్లీ దేశంలో అమలు చేయడం జరుగుతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రయాణికుల చేరవేతలో అన్ని రకాల వాహనాలకు అనుమతి ఇవ్వడంతో పాటు సరుకుల రవాణాపై గతంలో ఉన్న నిబంధనలను తొలగించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో విధించిన లాక్ డౌన్లో అనేక నిబంధనలను సడలిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రజారవాణాకు సంబంధించి ఇప్పటికే బస్సులు, ప్రైవేటు వాహనాలను నడుపుకునేందుకు అవకాశం కల్పించిన కేంద్రం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు తిరిగేందుకు మాత్రమే వాహనాలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ నిబంధనను కూడా తొలగించింది. 24 గంటలు అంటే రాత్రి వేళల్లో కూడా తమ సర్వీసులు కొనసాగించేలా అవకాశం కల్పించింది. భారీ వాహనాలపై ఉన్న పరిమితులను కూడా కేంద్రం ఎత్తివేసింది. రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకూ వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఈమేరకు నిబంధనలను సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. గూడ్స్, ట్రక్కులు, బస్సులు ప్రయాణించడానికి ఎలాంటి పరిమితులూ లేవని వివరించింది. ప్రజల కదలికలపై మాత్రం నిషేధం యథాతథంగా కొనసాగుతుందని పేర్కొంది. జన సమర్థ కార్యక్రమాల్లో పాల్గొనకుండా భౌతిక దూరం అమలయ్యేలా చూడాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు.
ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 164 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 133 కేసులు నమోదుకావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4484కి చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 174కి చేరింది. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల్లో లాక్డౌన్ అమల్లోకి వస్తుందన్న వార్తలతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు.