దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలు జోరుగా వినబడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ముఖ్య మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. గత పక్షం రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేవలం పక్షంరోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదుకావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇలానే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతే వైద్యం అందించడానికి కూడా ఇబ్బందులు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మరిన్ని రోజులు కొనసాగించి ఉంటే బాగుండేదనే వాళ్లు ఉన్నారు.
అయితే ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుండటంతోనే రిస్క్ అని తెలిసినా ప్రధానమంత్రి గత్యంతరం లేని పరిస్థితిలోనే లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారని మద్దతు తెలుపుతున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా భారత్లో ప్రమాద స్థాయికి చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనెల 16 ,17 తేదీల్లో సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. 16వ తేదీన 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతారు. ఆ తరువాత 17న మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమావేశం కానున్నారని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు శుక్రవారం మీడియాకు ఒక ప్రకటన వెల్లడించారు. లాక్ డౌన్ నహాయింపులు ఇచ్చిన తరువాతే కరోనా కేసులు దేశవ్యాప్తంగా పెరిగిపోతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ భేటీ నిర్వహించనున్నారు. దేశంలో లాక్డౌన్ మళ్లీ ప్రారంభించడానికి మోదీ అంత సుముఖంగా లేరని తెలుస్తోంది. కరోనా వ్యాప్తి దేశంలో గణనీయంగా తగ్గిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నివేదికల ఆధారంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిస్థితి మరీ దిగజారుతున్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రా్లో లాక్డౌన్పై పునఃసమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రజా రవాణాను నిషేధించడం, ఆరోగ్య పరీక్షలను పెంచడం వంటి వాటికి ఆదేశిస్తారని తెలుస్తోంది.