కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. దేశంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారంటూ రెండు, మూడు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. జూన్ 15 నుంచి దేశంలో మళ్లీ సంపూర్ణ లాక్డౌన్ విధిస్తారంటూ గత సోషల్ మీడియాలోవార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 16, 17 తేదీల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలకు మరింతగా రెక్కలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. దేశవ్యాప్తంగా మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవం కాదని కేంద్ర హోం శాఖ పేర్కొంది. లాక్డౌన్ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వదంతుల పట్ల ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని మోదీ మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో 82 రోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. జూన్ 8 నుంచి లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వైరస్ తీవ్రత పెరగడంతో ఆందోళన నెలకొంది.దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించబోతున్నారనే వార్తలు జోరుగా వినబడుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ముఖ్య మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది.
గత పక్షం రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కేవలం పక్షంరోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదుకావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇలానే కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతే వైద్యం అందించడానికి కూడా ఇబ్బందులు తప్పవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మరిన్ని రోజులు కొనసాగించి ఉంటే బాగుండేదనే వాళ్లు ఉన్నారు.అయితే ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుండటంతోనే రిస్క్ అని తెలిసినా ప్రధానమంత్రి గత్యంతరం లేని పరిస్థితిలోనే లాక్డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారని మద్దతు తెలుపుతున్న వారూ ఉన్నారు. ఇదిలా ఉండగా కరోనా భారత్లో ప్రమాద స్థాయికి చేరుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.