కరోనా మూడక్షరాలే అయినా.. ప్రపంచదేశాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంత వైరస్ అనతి కాలంలోనే దేవదేశాలు వ్యాప్తిచెంది లక్షల ప్రాణాలను బలితీసుకుంటోంది. ఇలా మనుషుల ప్రాణాలు తీస్తూ ఆగమాగం చేస్తున్న కరోనా.. మానవుడి మనుగడకే పెద్ద గండంగా మారింది. ఇక కరోనా వైరస్ అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలోకి వెళుతోంది ప్రపంచం. అయితే వాస్తవానికి రోగనిరోధకశక్తి తగ్గితే ఏకు లాంటి ఆరోగ్య సమస్య కాస్తా మేకు అవుతుంది. చికిత్సకు లొంగకపోగా త్వరత్వరగా వ్యాధి ముదిరిపోతుంది. కరోనా విషయంలో ఇదే జరుగుతోంది.
రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వారికి కరోనా వైరస్ తేలికగా సోకే అవకాశాలు ఎక్కువ. అందుకే రోగనిరోధకశక్తి పెంచుకోవాలని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధకశక్తి పెంచుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అలాంటి మంచి ఆహారంలో ఓట్స్ కూడా ఒకటి. సంపూర్ణ ధాన్య ఓట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా ఓట్స్లో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ మెండుగా ఉంటాయి. దాంతో మన శరీరంలో ఇమ్యూనిటీ స్థాయి పెరుగుతుంది. అలాగే ఓట్స్లో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజమూలకాలతో పాటు నిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.
అదేవిధంగా, ఓట్స్లో అధిక మోతాదులో విటమిన్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వలన శరీరానికి మంచి శక్తిని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓట్స్ తీసుకోవడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది మరియు గుండె జబ్బులు, మధుమేహం రాకుండా చేయగలదు. ఇక శరీరంలోని కొవ్వు శాతాన్ని అదుపులో ఉంచడమే కాకుండా మంచి బ్యాక్టీరియా అభివృద్ధికి ఓట్స్ సహకరిస్తాయి. అయితే అందరికీ ఓట్స్ పడకపోవచ్ఛు కాబట్టి వీటిని నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఓట్స్ను డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కరోనా నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు.