ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. ఆదివారం కొత్తగా 477 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన 4 మందికి కరోనా సోకినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4307కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు.
వైరస్బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ రోజు నమోదైన కేసులో రాష్ర్టానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన నలుగురు ఉన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్డౌన్ కొనసాగుతున్నది. ఆదివారం కొత్తగా అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5, గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66,విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి.
కరోనా వైరస్ నియంత్రణకు మళ్లీ లాక్డౌన్ అమలు చేసేందుకైనా వెనకాడది లేదని ఏపీ ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అయితే ఎక్కడయితే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయో ఆయా ప్రాంతాల్లోనే లాక్డౌన్ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే. ఒంగోలు పట్టణంలో కంటైన్మెంట్ జోన్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. నగరంలో మళ్లీ లాక్డౌన్ విధించాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజుల పాటు ఒంగోలు నగరాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే మిగతా జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరిగితే ఇదే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది.