సోమాజీగూడలోని ఓ పత్రిక కార్యాలయంలో రాండమ్గా 125 మందికి కరోనా టెస్ట్లు చేయిస్తే… అందులో 16 మందికి పాజిటీవ్ అని తేలిందని సమాచారం. ఊహించని పరిణామంతో .. యాజమాన్యం షాక్కి గురైందని తెలుస్తోంది. ఏకంగా ఒకేసారి 16 మందికి కరోనా సోకినట్టు ఓ వార్త… మీడియా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒకేసారి ఇన్ని కేసులు నమోదైన తొలి తెలుగు మీడియా సంస్థ అని చెప్పాలి. గతంలో కూడా ప్రధాన పత్రికలోని ఓ రిపోర్టర్కు పాజిటివ్ రావడంతో దాదాపు 15మందిని క్వారంటైన్ చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ఇటీవల వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్న విషయం తెలిసిందే.
అలాగే ఖైరతాబాద్లో ఒకే సారి 23 మంది జర్నలిస్టులకు పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా సదరు పెద్ద సంస్థలో పదహారు మందికి పాజిటివ్ రావడంతో మీడియా వర్గాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ పదహారు మంది ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు? అనే విషయాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. మిగతా ఉద్యోగులు వందల సంఖ్యలో ఉండటంతో వారందరికీ పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామంతో అటు యాజమాన్యంలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.
కేవలం 125 మందికి, అందునా రాండమ్ టెస్ట్ చేయిస్తే ఇన్ని కేసులంటే.. అందరికీ టెస్టులు చేయిస్తే, ఇంకెన్ని కేసులు బయటపడతాయో అనే భయం పట్టుకుంది. కరోనా భయాల మధ్య రిపోర్టర్లు, సబ్ ఎడిటర్స్ ఆఫీసులకు వెళ్లడానికే భయపడుతున్నారు. కానీ యాజమాన్యం మాత్రం వరుసగా సెలవలు తీసుకుంటున్నవాళ్లపై సీరియస్గా దృష్టి పెడుతోంది. వెళితే కరోనా భయం. వెళ్లకపోతే.. ఉద్యోగం పోతుందేమో అన్న ఆందోళన. ఈ రెండింటిమధ్య బతుకు వెళ్లదీస్తున్నారు ఉద్యోగులు.ఆ సంస్థ ఉద్యోగుల బతుకు దినదిన గండంగా మారింది.