అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి ప్రసాదించిన పండ్లలో అరటిపండు ఒకటి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఏ సీజన్లోనైనా విరివిగా లభించే అరటి పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. అరట పండ్లను మన డైలీ డైట్లో చేర్చోవడం వల్ల దీనిని జీవక్రియలకు కావాల్సిన ఆంటి యాక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పొందవచ్చు. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లల ఎదుగుదలకు కూడా అరటి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.
అరటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. అలాగే అరటిపండులో పొటాషియం కన్నా సోడియం తక్కువ ఉంటుంది. దీంతో రక్తపోటు ఉన్న వారికి కూడా ఇది మంచి పోషకాహారము. అరటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇక మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి ఒక నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఇక ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి అది మలబద్దకాన్ని నివారిస్తుంది.
అయితే అరటి పండును భోజనం తర్వాత తీసుకోవడం చాలా మంది చేసే పని. కానీ, రాత్రి భోజనం తర్వాత మాత్రం అరటి పండు తీసుకోవద్దు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడడానికి, జలుబుకు దారితీస్తుంది. అందుకే దీన్ని రాత్రుళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. దానికి బదులు మధ్యాహ్న సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే, ఖాళీ కడుపుతో లేదా పరగడుపున ఈ పండును తినడం మంచిది కాదు. దీన్లో ఉండే అత్యధిక చక్కెరలు తక్షణ శక్తిని అందించినా, అంతే వేగంగా కొన్ని గంటల వ్యవధిలోనే అలసటకూ గురిచేస్తాయి.